కారు ఢీకొని రైతు మృతి
ABN , First Publish Date - 2021-05-09T05:48:16+05:30 IST
కారు ఢీకొని రైతు మృతి చెందిన ఘటన మండల కేంద్రం భట్టిప్రోలులో శనివారం చోటుచేసుకుంది.
భట్టిప్రోలు, మే 08: కారు ఢీకొని రైతు మృతి చెందిన ఘటన మండల కేంద్రం భట్టిప్రోలులో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శామ్యూల్ రాజీవ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోతాబత్తుని వెంకట సుబ్బారావు(52) మధ్యాహ్నం కోడిపర్రు రోడ్డులో గల పంట పొలానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో ఫోర్డు కారులో కోళ్లపాలెం గ్రామానికి చెందిన నీలా శివరామకృష్ణ, మరో నలుగురు ఎదురుగా వస్తున్నారు. శివరామకృష్ణ వాహనాన్ని నడుపుతున్నాడు. ఆ సమయంలో వారంతా మద్యం తాగినట్లు సమాచారం. కారు రాంగ్రూట్లో వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో సుబ్బారావు ఎగిరి పొలాల్లో పడి మృతి చెందాడు. కారు దిగి పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని పంట పొలాల్లో ఉన్న రైతులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజీవ్కుమార్ తెలియజేశారు.