కేబీసీలో లాటరీ గెల్చుకున్నారంటూ..
ABN , First Publish Date - 2021-04-17T06:54:33+05:30 IST
కేబీసీలో లాటరీ గెలుచుకున్నారు.. డబ్బులు కావాలంటే రూ. 50,100 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ నమ్మించాడు ఓ ఆగంతుకుడు.
పంజాగుట్ట, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): కేబీసీలో లాటరీ గెలుచుకున్నారు.. డబ్బులు కావాలంటే రూ. 50,100 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ నమ్మించాడు ఓ ఆగంతుకుడు. డబ్బు వస్తుందనే ఆశతో తండ్రికి తెలియకుండా కుమారుడు మూడుసార్లు సంబంధిత నంబర్కు ఫోన్ పే ద్వారా డబ్బు పంపించాడు. తనకు తెలియకుండా ఖాతా నుంచి డబ్బులు డ్రా కావడంతో మోసం జరిగిందని గ్రహించిన తండ్రి పంజాగుట్ట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. పంజాగుట్ట కుమ్మరిబస్తీకి చెందిన జి.గోపాల్రెడ్డి డైవ్రర్. ఈ నెల 12న తన మొబైల్ ఫోన్ను కుమారుడు గుణశేఖర్కు ఇచ్చాడు. అతడు ఫోన్ చూస్తుండగా గుర్తుతెలియని రెండు ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ వచ్చాయి. మీరు కేబీసీ లాటరీ గెల్చుకున్నారు, రిజిస్ట్రేషన్ కోసం రూ. 50,100 చెల్లించాలి అని ఆగంతుకుడు చెప్పాడు. ఫోన్ పే ద్వారా పంపించాలని ఒక నెంబర్ పంపించాడు. అతడి మాటలు నమ్మిన గుణశేఖర్ తండ్రికి తెలియకుండా మూడుసార్లు రూ. 16 వేలు, 25 వేలు, రూ. 9,100 వేలు ఫోన్ పే ద్వారా పంపించాడు. తన ఖాతా నుంచి గుర్తుతెలియని నంబర్కు ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాని గోపాల్రెడ్డి 13వ తేదీన గుర్తించాడు. కుమారుడు, కుటుంబ సభ్యులను అడగగా.. గుణశేఖర్ విషయం తండ్రికి చెప్పాడు. కేటుగాళ్లు డబ్బు కాజేశారని గ్రహించిన బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.