క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-09-30T09:23:21+05:30 IST

ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఒకరిని నార్త్‌జోన్‌ ..

క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఒకరిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్ట్‌ చేశారు. తుకారాంగేట్‌ పోలీస్టేషన్‌ పరిధిలోని ఈస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన కర్నాటి సుధీర్‌ అలియాస్‌ రాజా (46) ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసేవాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కర్నాటి సుధీర్‌ 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని సంచార్‌ ప్యాలెస్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.


విలాసాల కోసం క్రికెట్‌ బెట్టింగ్‌ దందాను ప్రారంభించాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన బుకీ ప్రాచీతో పరిచయం పెంచుకున్నాడు. తనకున్న పరిచయాలతో ఇంట్లోనే బెట్టింగ్‌ దందా ప్రారంభించాడు. ఇతడి దందాపై పక్కా సమాచారమందుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడి చేశారు. దుబాయ్‌లో జరుగుతున్న బెంగళూరు, ముంబై జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌కు బెట్టింగ్‌లు స్వీకరిస్తుండగా అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ. 45,000 నగదు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడితోపాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని తుకారాంగేట్‌ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2020-09-30T09:23:21+05:30 IST