క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-10-15T06:44:07+05:30 IST

: క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన బుకీ, అతడి సహాయకులు ఇద్దరు, నలుగురు సబ్‌ బుకీలు మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేశారు.

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి

ప్రధాన బుకీ, నలుగురు సబ్‌ బుకీలు సహా ఏడుగురి అరెస్ట్‌.. రూ. 28,96,300 నగదు, 

18 సెల్‌ఫోనలు, ఇన్నోవా వాహనం స్వాధీనం

అనంతపురం క్రైం, అక్టోబరు 14: క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన బుకీ, అతడి సహాయకులు ఇద్దరు, నలుగురు సబ్‌ బుకీలు మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.28,96,300 నగదు, 18 సెల్‌ఫోనలు, ఇన్నోవా వాహనం స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం డీఎస్పీ వీర రాఘ వరెడ్డి, నాల్గవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్‌ఐ లు జమాల్‌బాషా, రంగయ్య, చంద్రశేఖర్‌, గంగాధర్‌ తదితర సిబ్బందితో కలిసి గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నగర శివారులోని తపోవనం ప్రాంతానికి చెందిన మంగల ప్రసాద్‌ (పాత నేరస్తుడు) గత కొన్నేళ్లుగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడి సొమ్ము చేసుకునేవాడు. మూడేళ్ల కిందట ఇతడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపినా ఎలాంటి మార్పురాలేదు. తర్వాత బుకీ అవతారం ఎత్తి నార్పల మండలం కురగానిలపల్లి గ్రామానికి చెందిన బూసుపల్లి రఘునాథరెడ్డికి ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూర్‌కు తీసుకెళ్లి క్రికెట్‌ బెట్టింగ్‌ అకౌంట్స్‌పై శిక్షణ ఇచ్చాడు. తర్వాత తన వద్దే ఉంచుకుని క్రికెట్‌ లెక్కలు రాయిస్తూ నెలకు రూ.20 వేలు జీతం ఇచ్చేవాడు. ఆత్మకూరు మండలం శిద్దరాంపురం గ్రామానికి చెందిన ఫృథ్వీకి ఫోనల ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌కు వచ్చే వివరాలను ఎప్పటికప్పుడు తెలి యజేసే విధంగా శిక్షణ ఇప్పించాడు. వీరిద్దరి సహకారం తో మంగల ప్రసాద్‌ గుట్టుచప్పుడు కాకుండా రోజుకు లక్షల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ లావాదేవీలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. వీరి కింద సబ్‌ బుకీలుగా పుట్టపర్తికి చెందిన గంగాద్రి, షేక్‌ గౌస్‌ మొహిద్దీన, రమేష్‌, ధర్మవ రానికి చెందిన శ్రీరామబాలాజీ ఉంటూ క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల నుంచి డబ్బు సేకరించి ఎప్పటి కప్పుడు మంగల ప్రసాద్‌కు పంపించేవారు. ప్రస్తుతం ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యా చలు జరుగుతుండటంతో జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు, స్పెషల్‌ పార్టీ సిబ్బంది డీఎస్పీ నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి గత కొన్ని రోజులుగా  తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం రా త్రి నగర శివారులోని తపోవనం సర్కిల్‌ ప్రాంతంలో బెట్టింగ్‌ నిర్వహిస్తుండటంతో దాడులు చేసి ఈ ఏడు గురితో కూడిన ముఠాను అరెస్ట్‌ చేశారు. క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేసిన నాల్గవ పట్టణ పోలీసులతో పాటు స్పెషల్‌పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప అభినందించారు.

Updated Date - 2021-10-15T06:44:07+05:30 IST