మోగని బ్రాండ్ బాజా!

ABN , First Publish Date - 2020-05-12T07:16:28+05:30 IST

లాక్‌డౌన్‌తో మీడియా, వినోద రంగానికి అడ్వర్టైజ్‌మెంట్‌, సబ్‌స్ర్కిప్షన్‌ ఆదాయం భారీగా తగ్గిందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఈ ఇండస్ట్రీ మొత్తం ఆదాయం...

మోగని బ్రాండ్ బాజా!

  • 2020-21లో 16శాతం తగ్గనున్న 
  • మీడియా, వినోద రంగ రాబడి
  • రూ.1.3 లక్షల కోట్లకు పరిమితం 
  • తాజా నివేదికలో క్రిసిల్‌ అంచనా 


న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో మీడియా, వినోద రంగానికి అడ్వర్టైజ్‌మెంట్‌, సబ్‌స్ర్కిప్షన్‌ ఆదాయం భారీగా తగ్గిందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఈ ఇండస్ట్రీ మొత్తం ఆదాయం 16 శాతం క్షీణించవచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది. మీడియా, వినోద రంగ మొత్తం ఆదాయంలో ప్రకటనల (యాడ్స్‌) ద్వారా సమకూరే వాటా 45 శాతం. యాడ్స్‌పై రాబడి ఈసారి 18 శాతం వరకు తగ్గవచ్చని అంచనా. 55 శాతం వాటా కలిగిన సబ్‌స్ర్కిప్షన్‌ రాబడి 14 శాతం వరకు పడిపోవచ్చని క్రిసిల్‌ అంటోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ ఇండస్ట్రీ టర్నోవర్‌ రూ.1.3 లక్షల కోట్లకు పడిపోవచ్చని అంచనా. దేశంలోని 78 మీడియా, వినోద సేవల సంస్థల నుంచి సేకరించిన వివరాలను విశ్లేషించి క్రిసిల్‌ ఈ రిపోర్టును రూపొందించింది. మరిన్ని ముఖ్యాంశాలు.. 


  1. గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో మీడియా, వినోద రంగ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.1.55 లక్షల కోట్లకు చేరి ఉంటుందని అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2018-19)లో 10 శాతం వృద్ధితో రూ.1.42 లక్షల కోట్లుగా నమోదైంది 
  2. ఇప్పటికే మందగమనంలో కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ.. కరోనా సంక్షోభంలో పూర్తిగా కుదేలైంది. తత్ఫలితంగా ఈసారి పరిశ్రమ రెవెన్యూ గత ఏడాదితో పోలిస్తే రూ.25,000 కోట్లు (16 శాతం) తగ్గవచ్చు 
  3. ఆదాయం తగ్గుదల పరిశ్రమ రుణ చెల్లింపుల సామర్థ్యాన్ని బలహీనపర్చే అవకాశం ఉంది. కంపెనీ ఆర్థిక సామర్థ్యం, రికవరీకి పట్టే సమయం ఇండస్ట్రీ పరపతిపై ప్రభావాన్ని తెలుపనున్నాయి
  4. మీడియా, వినోద రంగానికి ప్రకటనలపై వచ్చే ఆదాయం ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులకు అద్దం పడుతుంది. దీర్ఘకాల లాక్‌డౌన్‌తో ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి దశాబ్దాల కనిష్ఠానికి పడిపోనుంది 
  5. ఆర్థిక మందగమనం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలోనూ ప్రకటనల ఆదాయ వృద్ధి అంతంత మాత్రంగానే నమోదైంది 


సంప్రదాయ మీడియాపై అధిక ప్రభావం 

కరోనా సంక్షోభ సంవత్సరంలోనూ డిజిటల్‌ మీడియా ఆదాయం మరింత వృద్ధి చెందనుందని క్రిసిల్‌ పేర్కొంది. వృద్ధి జోరు మాత్రం కాస్త తగ్గవచ్చంటోంది. సంప్రదాయ మాధ్యమాలైన టెలివిజన్‌, ప్రింట్‌, రేడియో, అవుట్‌ డోర్‌ మీడియా (బహిరంగ ప్రదేశాల్లోని హోర్డింగ్‌లు, డిజిటల్‌ యాడ్‌ స్ర్కీన్లు), సినిమాల ఆదాయం గణనీయంగా తగ్గనుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సచిన్‌ గుప్తా అన్నారు. 


టీవీ

లాక్‌డౌన్‌ సమయంలో కొత్త కంటెంట్‌ను ప్రసారం చేయలేకపోవడం, ఐపీఎల్‌ వంటి అత్యంత జనాదరణ కలిగిన క్రీడా కార్యక్రమం వాయిదా పడటం టీవీ యాడ్స్‌ రెవెన్యూపై అధిక ప్రభావం చూపింది. టీవీ చానెళ్లకు సబ్‌స్ర్కిప్షన్‌ ద్వారా లభించే ఆదాయం మాత్రం ప్రభావితం కాలేదు. 


దినపత్రికలు 

దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో దినపత్రికలకు డిస్ట్రిబ్యూషన్‌ పరంగా సవాళ్లు ఎదురయ్యాయి. దాంతో సర్క్యులేషన్‌ ఆదాయం తాత్కాలికంగా తగ్గింది. అంతేకాదు, అధికంగా ప్రకటనలిచ్చే ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌, ఈ-కామర్స్‌ తదితర రంగాల పునరుద్ధరణకు దీర్ఘకాలం పట్టవచ్చు. ఈ రంగాల నుంచి దినపత్రికలకు ప్రకటనలు బాగా తగ్గనున్నాయి. 


సినిమాలు

బాక్సాఫీస్‌ వసూళ్లు అనూహ్యంగా తగ్గిపోవడంతో సబ్‌స్ర్కిప్షన్‌ ఆదాయం పడిపోనుంది. 


డిజిటల్‌ 

దేశంలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, టాబ్లెట్‌ పీసీలు, పర్సనల్‌ కంప్యూటర్లు వంటి ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం డిజిటల్‌ మాధ్యమాల ఆదాయ వృద్ధికి దోహదపడుతోంది. 


Updated Date - 2020-05-12T07:16:28+05:30 IST