గుర్తు తెలియని బాలుడి దహనం

ABN , First Publish Date - 2022-07-03T05:00:04+05:30 IST

గుర్తు తెలియని బాలుడు దహనమైన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామ సమీపంలో చోటుచేసుకున్నది.

గుర్తు తెలియని బాలుడి దహనం
బాలుడి శవాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

 పెంట్లవెల్లి, జూలై 2 : గుర్తు తెలియని బాలుడు దహనమైన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామ సమీపంలో చోటుచేసుకున్నది. సీఐ యాలాద్రి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  సింగవరం గ్రామ రెవెన్యూ శివారులో కొండూరు గ్రామ సమీపంలోని బొంగులోనిగుట్ట దగ్గర శనివారం ఉదయం 10 గంటల సమయంలో కొండూరు గ్రామానికి చెందిన సింగిల్‌ విండో చైర్మన్‌ విజయరామారావు వ్యవసాయ పొలానికి వెళ్తుండగా బాలుడి శవం కనిపించింది. ఆయన పోలీసులకు సమాచారమివ్వడంతో 11 గంటల సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. బాలుడి వయస్సు 8 సంవత్సరాలు ఉండవచ్చని శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బాలుడిని దహనం చేసి ఉంటారని, వర్షం రావడంతో దాదాపు 60 శాతం శరీరం కాలిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నల్ల రంగు పాయింట్‌, నారింజ రంగు హాఫ్‌ షర్టు కలిగి ఉన్నాడు. ఎర్రరంగు మొలతాడు ఉన్నది. బాలుడి ఆచూకీ కోసం ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీలోని ముచ్చుమర్రి, ఇతర ప్రాంతాలకు సమాచారమిచ్చామని సీఐ చెప్పారు. మృతదేహాన్ని ఆసుపత్రిలో ఉంచామని ఎవరికైనా ఆచూకీ తెలిస్తే కొల్లాపూర్‌ పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. బాలుడిని సజీవంగా దహనం చేశారా, హత్య చేసి దహనం చేశారా, ఎక్కడి నుంచి ఎవరు తీసుకువచ్చారనే విషయాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-07-03T05:00:04+05:30 IST