తుస్సు
ABN , First Publish Date - 2020-11-16T06:15:32+05:30 IST
టపాసుల వ్యాపారం తుస్సుమంది
జిల్లాలో షాపులు పెరిగినా.. తగ్గిన టపాసుల అమ్మకాలు
కరోనాకు తోడు ప్రభుత్వ పన్నులు, మామూళ్ల భారం
తిరుపతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గతేడాదిలా.. తారాజువ్వలు ఎగరలేదు. చిచ్బుబుడ్లు వెలుగులు విరజిమ్మలేదు. ఢాం టపాసులు పేలలేదు. మొత్తమ్మీద కొవిడ్ నేపథ్యంలో టపాసుల వ్యాపారం ఈ ఏడాది తుస్సుమంది. నిరుడికన్నా టపాసుల దుకాణాలు పెరిగినా.. వ్యాపారం మాత్రం 40 శాతం వరకు తగ్గిపోయినట్టు విక్రయదారులు చెబుతున్నారు. దానికి తోడు స్టేట్ ట్యాక్స్ భారీగా వసూలు చేయడంతోపాటు కొందరు అధికారుల మామూళ్లకే సరిపోయిందని గగ్గోలు పెడుతున్నారు. కరోనా పేరు చెప్పి భయపెట్టడం, ఎడతెరపకుండా వర్షం కురవడంతో వ్యాపారం చిచ్చుబుడ్డిలా విరజిమ్మక పోవడానికి కారణాలుగా తెలుస్తున్నాయి. కాగా, రెండు గంటలే టపాసులు కాల్చాలన్న నిబంధన చాలాచోట్ల అమలు కాలేదు. తిరుపతిలో టపాసుల వ్యాపారం బాగా కనిపిస్తుంది. తిరుపతి అర్బన్, రూరల్లో ఈ ఏడాది 63 షాపులు ఏర్పాటు చేశారు. గతం కంటే 40 శాతం పైగా వ్యాపారాలు పడిపోయాయని వాపోతున్నారు. మదనపల్లె డివిజన్ పరిధిలో దాదాపు 85 షాపుల వరకు ఏర్పాటుచేశారు. కరోనాను దృష్టిపెట్టుకుని వ్యాపారుల అభ్యర్థనమేరకు గతం కంటే తక్కువ జీఎస్టీని కట్టించుకున్నట్టు తెలుస్తోంది. గతేడాది కోటి రూపాయలు వ్యాపారం జరిగితే ఈసారి రూ.60లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు.కుప్పం పరిధిలో 22 టపాకాయల దుకాణాలు ఏర్పాటుచేయగా ఇక్కడ అమ్మకాలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని వ్యాపారవేత్తలు అంటున్నారు. రొంపిచెర్లలో రెండు దుకాణాలకు ఆలస్యంగా లైసెన్స్ మంజూరు చేయడంతో కరోనా ఒకవైపు, వర్షాలు కురవడంతో వ్యాపారులు నిరుత్సాహపడ్డారు. పలమనేరులో 12 దుకాణాలు ఏర్పాటుచేస్తే గత ఏడాదితో పోల్చుకుంటే 40 శాతం మాత్రమే అమ్మకాలు జరిగినట్టు దుకాణదారులు చెబుతున్నారు. పాకాలలో గతం కంటే తక్కువగా 4 దుకాణాలు ఏర్పాటు చేసినప్పటికీ వ్యాపారం పర్వాలేదంటున్నారు. శ్రీకాళహస్తిలో గత ఏడాది ఏర్పాటుచేసిన 14 దుకాణాలనే మళ్లీ ప్రారంభించారు. ఇక్కడా వ్యాపారం పర్వాలేదనిపించింది.
టపాకాయల దుకాణాల వివరాలు
ఊరు 2019 2020
చిత్తూరు 48 49
తిరుపతి అర్బన్ 45 47
తిరుపతి రూరల్ 13 16
మదనపల్లి 27 28
పుత్తూరు 25 14
పలమనేరు 23 22
కుప్పం 38 42
నగరి 5 5
పుంగనూరు 22 23
సత్యవేడు 10 6
పీలేరు 29 38
ములకలచెరువు 13 15
పాకాల 11 11
వాల్మీకిపురం 11 11