సీపీఎస్‌ రద్దులేదు.. పీఆర్సీ లేదు

ABN , First Publish Date - 2021-10-20T08:53:42+05:30 IST

ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ఇది ప్రభుత్వ బాధ్యత అని ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని

సీపీఎస్‌ రద్దులేదు.. పీఆర్సీ లేదు

  • రెండున్నరేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం
  • ఏపీటీఎఫ్‌ ధర్నాలో ఎమ్మెల్సీ రఘువర్మ డిమాండ్‌


అమరావతి (ఆంధ్రజ్యోతి), విజయవాడ సిటీ, అక్టోబరు 19: ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ఇది ప్రభుత్వ బాధ్యత అని ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నా మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎమ్మెల్సీ రఘువర్మ హాజరయ్యారు. కృష్ణా, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రఘువర్మ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అధికారంలోకొస్తే వారంలోనే సీపీఎస్‌ రద్దు అన్న మాటే మరిచిపోయిందని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఊసే లేదని విమర్శించారు. పీఆర్‌సీ ఇవ్వాల్సిన గడువు దాటి 40 నెలలైందని, ఐదు డీఏలు బకాయిపడ్డాయని అన్నారు.     ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి పాండురంగ మాట్లాడుతూ  ప్రాథమిక పాఠశాలల్ని విజభన చేయకూడదని, తెలుగు మీడియం కొనసాగించాలని కోరారు.


బదిలీల తర్వాతే ఎయిడెడ్‌ విలీనం: ఎమ్మెల్సీ కత్తి  

మున్సిపల్‌ పాఠశాలల్లోని రెగ్యులర్‌ టీచర్లకు పదోన్నతులు, బదిలీలు చేశాకే.. ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల విలీన ప్రక్రియ చేపట్టాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు భవిష్యత్తులో సీనియారిటీ సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.   ఈ మేరకు మున్సిపల్‌ శాఖ కమిషనర్‌, డైరక్టర్‌కు కత్తి నరసింహారెడ్డి మంగళవారం లేఖ రాశారు.

Updated Date - 2021-10-20T08:53:42+05:30 IST