బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలి.. అది కాంగ్రెస్‌తోనే సాధ్యం: Tammineni

ABN , First Publish Date - 2022-01-20T18:22:35+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలి.. అది కాంగ్రెస్‌తోనే సాధ్యం: Tammineni

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులు కాలరాస్తోన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటంలో కేసీఆర్ విఫలమయ్యరన్నారు. కేసీఆర్ స్టార్టజీ బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడమే అని అన్నారు. కేసీఆర్ విధానం బీజేపీకి సహాయం చేయడమనే అనుమానం కలుగుతోందని తెలిపారు. ఈ అంశంపై ఆల్ ఇండియా మహాసభలో చర్చ జరుగుతోందని చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిపై చర్చిస్తామన్నారు. తేజస్వి యాదవ్ కేసీఆర్‌ను కలిసినప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని చెప్పినట్టు వార్తలు వచ్చాయన్నారు.  బీజేపీ ఏతర అన్ని పార్టీలు ఏకం కావాలని.. అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై ఉగ్రదాడి అనేది పొలిటికల్ స్టాంట్‌లో భాగమే అని అన్నారు. కేసీఆర్, బీజేపీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.


అలాగే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317జీవో వెంటనే రద్దు చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. జీవో ఆశస్త్రీయంగా ఉందని, ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలన్నారు. మన ఊరు మన బడి పేరుతో 3వేల కోట్ల కాంకర్యం చేసేలా కనిపిస్తోందని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తున్నప్పటికీ మాతృభాష తెలుగును కూడా సమాంతరంగా బోధించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం తప్ప ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. కేవలం 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-01-20T18:22:35+05:30 IST