రోడ్లపై వరినాట్లు రహదారుల అధ్వానంపై సీపీఎం వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-07-25T05:41:03+05:30 IST
రహదారుల అధ్వానంపై సీపీఎం నాయకులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నిమార్లు అధికారులకు కోరినా పట్టించుకోకపోవడంతో సీపీఎం నాయకులు రోడ్లపై వరినాట్లు నాటుతూ ఆందోళన చేపట్టారు.
పెనుకొండ, జూలై 24: రహదారుల అధ్వానంపై సీపీఎం నాయకులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నిమార్లు అధికారులకు కోరినా పట్టించుకోకపోవడంతో సీపీఎం నాయకులు రోడ్లపై వరినాట్లు నాటుతూ ఆందోళన చేపట్టారు. ప్రసిద్ధి చెందిన బాబయ్య దర్గాకు వెళ్లే రోడ్డుపై శనివారం వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దర్గా రోడ్డు నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 9న రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకర్నారాయణ రూ.20లక్షలు మంజూరుచేసి శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారన్నారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. దర్గాకు వచ్చే భక్తులురోడ్డు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్లన్నీ నీటి మడుగుగా మారుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు హరి, రమేష్, సీఐటీయు నాయకులు బాబావలి, నరసింహులు, తోపుడుబండ్ల సంఘం నాయకులు రాజారావు, ఆటో యూనియన నాయకులు రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.