ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-07-05T04:02:36+05:30 IST
సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సీపీఎం చేపట్టిన ఇంటింటికి సీపీఎం కార్యక్రమం సోమవారంతో ముగిసింది.
ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా
ముగిసిన ఇంటింటికి సీపీఎం
కావలిటౌన్, జూలై 4: సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సీపీఎం చేపట్టిన ఇంటింటికి సీపీఎం కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవో శీనానాయక్కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ చెత్త పన్ను ప్రజలకు పెను భారంగా మారిందని, దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో 20నుంచి 30ఏళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు 225 జీవో ప్రకారం పట్టాలు ఇవ్వాలన్నారు. టిడ్కో గృహాలు వెంటనే లబ్ధిదారులకివ్వాలని కోరారు. పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. పారిశుధ్యం మెరుగుపరిచి, రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలన్నారు. పట్టణంలో పందులు, కుక్కలు, దోమల సమస్య పరిష్కరించాలన్నారు. పన్ను బకాయిలు పింఛన్ డబ్బుల్లో పట్టుకోకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మధుసూదన్రావు, పెంచలనరసింహ, వై కృష్ణమోహన్, అమీర్ బాషా, పుల్లా సుబ్రహ్మణ్యం, అమర్కుమార్, బీ వెంకటేశ్వర్లు, డీవైఎ్ఫఐ నాయకులు కృష్ణయ్య, చెన్నయ్య, వినయ్, సీహెచ్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.