11 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ABN , First Publish Date - 2022-07-07T03:57:46+05:30 IST

మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నారని, తక్షణం వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నేతలు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.

11 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె
రూరల్‌ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిస్తున్న నేతలు

సమస్యలు పరిష్కరించాలని రూరల్‌ ఎమ్మెల్యేకు వినతి

నెల్లూరు (వైద్యం), జూలై 6 : మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నారని, తక్షణం వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నేతలు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. బుధవారం మున్సిపల్‌ కార్మికుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పెంచలనర్సయ్య, గౌరవాధ్యక్షుడు కుమార్‌లతో కలసి రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయానికి సీపీఎం నేతలు, కార్మికులు ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మూడేళ్లగా పోరాడుతున్నా ఫలితం లేదన్నారు. సమానపనికి సమాన వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ నేటికీ నెరవేరలేదన్నారు. హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు 5 నెలలుగా ఇవ్వటం లేదని, జీతాలు సక్రమంగా ఇవ్వటం లేదని, 60ఏళ్లు దాటిన వారికి ఎలాంటి బెనిఫిట్స్‌ ఇవ్వకుండా ఇంటికి పంపించేస్తున్నారని, వారి స్థానంలో పనిలోకి తీసుకున్న వారసులకు 11 నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదన్నారు. ఈ నేపథ్యంలో సమ్మెకు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బత్తల క్రిష్ణయ్య, కొండా ప్రసాద్‌, సుజాత, వజ్రమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-07T03:57:46+05:30 IST