టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించాలి
ABN , First Publish Date - 2022-07-01T05:40:23+05:30 IST
టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు తక్షణం స్వాధీనం చేయాలని, లేకుంటే లబ్ధిదారులే స్వాధీనం చేసుకుంటారని సీపీఎం పట్టణ కమిటీ హెచ్చరించింది.
భీమవరం అర్బన్, జూన్ 30: టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు తక్షణం స్వాధీనం చేయాలని, లేకుంటే లబ్ధిదారులే స్వాధీనం చేసుకుంటారని సీపీఎం పట్టణ కమిటీ హెచ్చరించింది. ఇంటింటికి సీపీఎం కార్యక్రమం ముగింపు సందర్భంగా గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా నాయకులు డి కళ్యాణి, పట్టణ కార్యదర్శి వాసుదేవరావు, వైకుంఠరావు మాట్లాడుతూ లబ్ధిదారులు అప్పులు తెచ్చి ఆరేళ్లుగా వడ్డీలు చెల్లిస్తున్నారని, మరోపక్క ఇంటి అద్దె చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే టిట్కో ఇల్లు లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్కు వినతిపత్రం అందించారు. సీహెచ్ వెంకటేశ్వరరావు, డి నాగేశ్వరరావు, కే.విజయ శామ్యులు, వీరస్వామి, నాగూర్ బేబి, బి వరలక్ష్మి పాల్గొన్నారు.
తణుకు: పట్టణ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పీవీ ప్రతాప్ డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం కమిషనర్ సృజనకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వ హామీ మేరకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గార రంగారావు, గుబ్బల గోపి, నాగరత్నం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పెంటపాడు: ప్రజా సమస్యలు పరిష్కరించాలని పెంటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జక్కంశెట్టి సత్యనారాయణ, మండల కార్యదర్శి చిర్లా పుల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, గ్రామాల్లో మంచినీరు కొనుగోలు చేసి తాగవలసి వస్తోందన్నారు. తహసీల్దార్ శేషగిరిరావుకు వినతిపత్రం అందజేశారు.