టీఆర్ఎస్కే సీపీఐ మద్దతు
ABN , First Publish Date - 2022-08-20T10:21:06+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్కే మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయించింది.
సీఎం కేసీఆర్తో చాడ, కూనంనేని, పల్లా భేటీ
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్కే మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయించింది. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. వీరి మధ్య మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మునుగోడు ఉప ఎన్నికలోనే కాకుండా భవిష్యత్తులోనూ కలిసి పని చేద్దామని సీపీఐ నేతలకు కేసీఆర్ ప్రతిపాదించారు. మతతత్వ బీజేపీని అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన సీపీఐ నేతలు కేసీఆర్ ప్రతిపాదనకు అంగీకరించారు. నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలుపొందిన చరిత్ర, పార్టీకి ప్రజాబలం అక్కడ ఎక్కువగా ఉన్నా.. ఉప ఎన్నికలో పోటీ చేయబోమని కేసీఆర్కు హామీ ఇచ్చారు. టీఆర్ఎ్సకు మద్దతివ్వాలని సీపీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో మునుగోడు ఉప ఎన్నికలో కీలకపరిణామం చోటుచేసుకున్నట్లయింది.