సీపీఐ నేత టీవీ చౌదరి మృతి

ABN , First Publish Date - 2020-06-04T08:38:02+05:30 IST

సీపీఐ సీనియర్‌ నేత తాళ్లూరి వెంకయ్య చౌదరి (టీవీ చౌదరి) (80) మంగళవారం రాత్రి కన్నుమూశారు.

సీపీఐ నేత టీవీ చౌదరి మృతి

ఖమ్మం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సీపీఐ సీనియర్‌ నేత తాళ్లూరి వెంకయ్య చౌదరి (టీవీ చౌదరి) (80) మంగళవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో రైతు కుటుంబంలో జన్మించిన టీవీ చౌదరి సీపీఐలో పలు పదవులు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా 15ఏళ్ల పాటు పనిచేశారు. 1998 నుంచి ఏడేళ్ల పాటు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత కిసాన్‌ సభ కేంద్ర కమిటీ సభ్యుడిగా రైతు సమస్యలపై పోరాడారు.


మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, సీపీఐ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు తదితరులు టీవీ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఖమ్మంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే  చౌదరి కుమారుడు లెనిన్‌ అమెరికాలో ఉండగా, కరోనా నిబంధనల కారణంగా ఆయన తండ్రి చివరి చూపునకు రాలేకపోయారు. చౌదరి మృతికి సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. టీవీ చౌదరి కమ్యూనిస్టు పార్టీకి, రైతు ఉద్యమానికి అందించిన సేవలు ఎనలేనివని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు. చౌదరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2020-06-04T08:38:02+05:30 IST