మంత్రి బాలినేనిపై రామకృష్ణ ఫైర్
ABN , First Publish Date - 2021-09-08T19:34:34+05:30 IST
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం: ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్ర బాలినేని స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు ప్రయాణం చేయటాన్ని ప్రజలు గమనించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అప్పులు తీసుకుంటూ ప్రజలపై రోజుకోరకంగా బారాలు మోపుతోందన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచకపోగా కుదిస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో మంత్రులు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారంటే వారికి అక్రమ సంపాదన కాకుండా డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించారు. మంత్రులు, ముఖ్య అధికారులు విదేశాలకు వెళ్లాలంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ప్రయాణిస్తారని.. వారు ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారంటే ఆలోచించాలని అన్నారు. బళ్లారి ఏరియాలో గాలి జనార్ధన్ రెడ్డి మైన్స్ను కొల్లగొట్టినట్లుగా ప్రకాశం జిల్లా చీమకుర్తి అడ్డాగా మంత్రి బాలినేని గనులను కొల్లగొట్టే పనిలో ఉండి ఆయన చీమకుర్తి జనార్దన్ రెడ్డి ఏమో అనిపిస్తుందని యెద్దేవా చేశారు. ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.