విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఉపసంహరించాలి: Ramakrishna
ABN , First Publish Date - 2021-09-13T17:05:21+05:30 IST
విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు.
అమరావతి: విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. గత 27 నెలల కాలంలో రూ.9 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేసిన ప్రభుత్వం మరోసారి సర్దుబాటు చార్జీల పేరుతో రూ.3669 కోట్లు మోపిందన్నారు. 2019-20కు టారిఫ్ వ్యత్యాసం పేరుతో మరో రూ.2,542 కోట్ల సర్దుబాటుకు అవకాశం ఇవ్వాలని విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్కు పిటిషన్ ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సై అనటం దుర్మార్గమని మండిపడ్డారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రామకృష్ణ అన్నారు.