సోమువీర్రాజు బహిరంగ చర్చకు సిద్ధమా?: Ramakrishna

ABN , First Publish Date - 2022-03-22T14:05:58+05:30 IST

రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు.

సోమువీర్రాజు బహిరంగ చర్చకు సిద్ధమా?: Ramakrishna

అమరావతి: రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. బీజేపీ రాయలసీమ రణభేరి సభ జరపటం సీమ ప్రజలను మోసం చేయడమే అని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఏమైందని ప్రశ్నించారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకపోగా, ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మేసే దుర్మార్గపు ఆలోచన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణం ఏమైనా జరిగిందా? అని అడిగారు. రాయలసీమ ప్రయోజనాలను దెబ్బతీసే రీతిలో కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదీ జలాలపై అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు నోరు విప్పలేదని ఆయన అన్నారు.


తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసి, మోసం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు తెచ్చేందుకు అనుమతినిచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ఏపీ అభివృద్ధి కోసం ఏనాడైనా కేంద్ర ప్రభుత్వంతో ఏపీ బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు అడుగడుగున ద్రోహం చేస్తూ, అధికారం కోసం తాపత్రయపడటానికి ఏపీ బీజేపికి సిగ్గుండాలని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-22T14:05:58+05:30 IST