అమ్మఒడి కూడా దశల వారీగా అటకెక్కించేస్తారా?: Ramakrishna
ABN , First Publish Date - 2022-05-21T17:09:30+05:30 IST
అమ్మఒడి కూడా దశల వారీగా అటకెక్కించేస్తారా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు.
అమరావతి: అమ్మఒడి కూడా దశల వారీగా అటకెక్కించేస్తారా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి(Jagana mohan reddy) అమ్మఒడి పథకంపై కూడా మాట తప్పి, మడమ తిప్పారన్నారు. ఈ ఏడాది జూన్లో విడుదల చేసే అమ్మఒడికి రూ.13 వేలు మాత్రమే జమ చేయాలనుకోవటం తగదని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమ్మఒడి అమలు చేయలేదని తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో ఇప్పటికే రూ.1000 కోత విధించిన ప్రభుత్వం, ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ.1000 తగ్గించనుందన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. అమ్మఒడి పథకం అమలులో కోతలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు మెలికలు పెట్టిందన్నారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కోతలు లేకుండా, రూ.15 వేలు తల్లులు ఖాతాల్లో జమ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.