అఖిలపక్షాలను ఆహ్వానించకపోవడం దుర్మార్గం: Ramakrishna
ABN , First Publish Date - 2022-04-04T14:04:38+05:30 IST
నూతన జిల్లాల ప్రారంభోత్సవానికి అఖిలపక్షాలను ఆహ్వానించకపోవడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.
అమరావతి: నూతన జిల్లాల ప్రారంభోత్సవానికి అఖిలపక్షాలను ఆహ్వానించకపోవడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... జిల్లాల ఏర్పాటు అన్ని రాజకీయ పక్షాలకు ఆమోదయోగ్యమైనా ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో హేతుబద్ధమైన సూచనలను కూడా బేఖాతరు చేయడం విచారకరమని మండిపడ్డారు. నూతన జిల్లాల ఏర్పాటు కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందినది కాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజలతో మమేకమై ఉంటే బావుండేదని అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష, నిరంకుశ విధానాలను ఇకనైనా మానుకోవాలని రామకృష్ణ హితవుపలికారు.