గుండ్లసింగారం భూములను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోం: నారాయణ
ABN , First Publish Date - 2022-06-22T17:39:16+05:30 IST
హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ఘటనపై సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ స్పందించారు.
వరంగల్: హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ఘటనపై సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ (Narayana) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మహిళలు, వృద్ధులపై భూమాఫియా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీశారు. ఇది పేదలపై దాడి కాదు ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్యానించారు. భూమాఫియా భూములను ఆక్రమిస్తే పోలీసులు వాళ్లకెందుకు మద్దతిస్తున్నారని అన్నారు. పోలీసులు సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. గుండ్ల సింగారం భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోమని స్పష్టం చేశారు. గుండ్లసింగారం ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే కోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని నారాయణ స్పష్టం చేశారు.
గుండ్ల సింగారంలో ఉద్రిక్తత
కాగా... హనుమకొండ మండలం గుండ్ల సింగారంలో నిన్న తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో 3000మంది పేదలు గుడిసెలు వేసుకోగా స్థానికులు వీరిని అడ్డుకున్నారు. భూమి మాది అంటూ పేదలు వేసుకున్న గుడిసెలను స్థానికులు తొలగించారు. ఈక్రమంలో స్థానికులకు, గుడిసెవాసులకు తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈదాడిలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పేదలు గుడిసెలకు వెళ్లే రోడ్డుకు అడ్డంగా స్థానికులు ముళ్లకంపలు వేశారు.