ఒంగోలు: సేవ్ ఇండియా - మోడీ హటావో నినాదం పేరుతో 27న భారత్ బంద్ నిర్వహిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. పోర్టులను ప్రైవేటీకరించడం వలన స్మగ్లింగ్ ఎక్కువై దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఆర్థిక నేరస్తులను కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ బ్యాంక్లను ఏర్పాటు చేసిందని విమర్శించారు. బిగ్ బాస్ కల్చర్ తెలుగు రాష్ట్రాల్లో అమలవుతోందన్నారు. బూతుల పంచాంగంతో తెలుగు రాష్ట్రాల మంత్రులు పోటాపోటీగా తిట్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్ళపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. 27న జరగబోయే బంద్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన తప్పులు చెబితే తమపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ బురద చల్లడం దారుణమని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.