భూసమస్యలు పరిష్కారం కాకపోతే తుపాకులు చేతబడతాం: Narayana
ABN , First Publish Date - 2022-06-13T17:39:31+05:30 IST
భూసమస్యలు పరిష్కారం కాకపోతే తుపాకులు చేతపడుతామని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హనుమకొండ: భూసమస్యలు పరిష్కారం కాకపోతే తుపాకులు చేతపడుతామని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ(Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం బాలసముద్రం ఏకశిలా పార్క్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కావాలని న్యాయబద్ధంగా పోరాడుతున్నామని తెలిపారు. ఆత్మగౌరవం కోసం సీపీఐ పోరాడుతోందన్నారు. ‘‘ప్రభుత్వంతో చావో, రేవో తేల్చుకుంటాం... ఉంటే గుడిసెలో లేకుంటే జైల్లో ఉంటాం’’ అంటూ స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టి పేదలపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల బాగోగులు చూడడం చేతకాక సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతున్నారని అన్నారు. సీఎంకు చిత్తశుద్ది ఉంటే వరంగల్లో పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు అండగా ఉండల్సిన ప్రభుత్వం ల్యాండ్ మాఫియాతో చేతులు కలుపుతోందన్నారు. ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు సహకరిస్తే తమతో యుద్దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కాపాడడానికి వస్తే తమపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. వరంగల్ పోరుగడ్డ, భూపోరాటాలకి ఇక్కడే నాంది పలుకుతామని అన్నారు. జక్కలోద్దిలో పేదల ఇండ్లను కాల్చడం దారుణమని నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.