వలస కార్మికులతో సీపీఐ ఆందోళన

ABN , First Publish Date - 2020-05-21T09:37:22+05:30 IST

వలస కార్మికులు ఆకలిలో అలమటిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ

వలస కార్మికులతో సీపీఐ ఆందోళన

బేగంపేట, మే 20 (ఆంధ్రజ్యోతి): వలస కార్మికులు ఆకలిలో అలమటిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ విమర్శించారు. రాజ్‌భవన్‌ ఎదురుగా ఉన్న ఎం.ఎస్‌.మక్తాలోని బిహార్‌ వలస కార్మికులతో కలిసి సీపీఐ నిర్వహించిన రాజ్‌భవన్‌ ముట్టడికి నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డితో పాటు పలువురు పాల్గొని బుధవారం ఆందోళన నిర్వహించారు.


ఉదయం 10 గంటల ప్రాంతంలో నారాయణ, చాడ వెంకటరెడ్డితో పాటు పలువురు బిహార్‌ వలస కార్మికులను పరామర్శించారు. కొద్ది రోజులుగా ఆకలితో అలమటిస్తున్నామని వారు చెప్పడంతో వెంటనే వారితో కలిసి సమీపంలో ఉన్న రాజ్‌భవన్‌ ముట్టడికి సీపీఐ నాయకులు యత్నించారు. సమాచారం అందడంతో పోలీసులు అక్కడ మోహరించారు. గవర్నర్‌ను కలిసి వలస కార్మికుల సమస్యలను వివరించేవరకు కదిలేది లేదని వారు ఆందోళన నిర్వహించారు.


అనంతరం పోలీసులు వారిని సమీపంలోని దిల్‌ఖుష్‌ అతిథి గృహం ప్రాంగణంలోకి పంపడంతో వారు అక్కడ బైఠాయించారు. నారాయణ మాట్లాడుతూ వలస కార్మికులు ఈ నెల 5న పోలీసుల వద్ద రిజిస్ర్టేషన్‌ చేసుకున్నా ఇంత వరకూ వారిని స్వస్థలాలకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. వలస కార్మికుల కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం చేయాలన్నారు. చర్యలు చేపడతామని పోలీసులు వారికి హామీ ఇవ్వడంతో సి.పి.ఐ నేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

Updated Date - 2020-05-21T09:37:22+05:30 IST