బృహత్తర కార్యక్రమానికి సజ్జనార్ శ్రీకారం.. కోటిన్నర ఖర్చుతో..
ABN , First Publish Date - 2021-05-15T14:21:29+05:30 IST
కోటిన్నర ఖర్చుతో...
- తెలంగాణ అంతటా సైబర్ కాప్స్ సేవలు
- ఉచితంగా కొవిడ్ ఎక్విప్మెంట్
- అన్ని జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రులకు..
- ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో ముందుకొచ్చిన ఐటీ సంస్థలు
- బృహత్తర కార్యక్రమానికి.. శ్రీకారం చుట్టిన సీపీ సజ్జనార్
- ఒక్కో జిల్లాకు ఒక్కో లారీ పంపిన సీపీ
హైదరాబాద్ సిటీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యలో సైబరాబాద్ పోలీసులు తమ సేవలను విస్తరింపజేస్తూ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొవిడ్ వ్యాప్తి నిరోధకానికి అత్యంత విలువజేసే ఎక్వి్ప్మెంట్లను తెలంగాణలోని అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.
సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసులు ప్రజలకు కొవిడ్ సేవలను విస్తృతంగా చేపట్టిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు అండగా నిలుస్తూ.. అలుపెరగని పోరాటం చేస్తున్న సీపీ సజ్జనార్ సైబరాబాద్తో పాటు మొత్తం ట్రై కమిషనరేట్ పరిధిలో తన కొవిడ్ సేవలను విస్తరింపజేశారు. రెండు రోజుల క్రితం ప్రాజెక్టు ఆశ్రయ్ పేరుతో ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రిని నిర్మించిన సీపీ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొవిడ్ సేవలను మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలని నిర్ణయించారు. అనేక జిల్లాల నుంచి ప్రజలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలి వస్తున్నారు. అక్కడి ఆస్పత్రుల్లో కొవిడ్కు సంబంధించి ఎటువంటి ఎక్విప్మెంట్ కొరత ఉందో తెలుసుకొని వాటిని సమకూరుస్తే ఎంతోమంది రోగులకు, ఆస్పత్రి సిబ్బందికి మేలు చేసినట్లవుతుందని భావించారు. అనుకున్నదే తడవుగా ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వలంటీర్లను రంగంలోకి దింపారు. అన్ని జిల్లాల ఆస్పత్రులకు పంపారు. అక్కడి ఆస్పత్రి ఉన్నతాధికారులు, డాక్టర్లను కలిసి ఏయే ఎక్వి్పమెంట్స్ అవసరమున్నాయో తెలుసుకొని జాబితాను సిద్ధం చేశారు.
కోటిన్నర ఖర్చుతో...
ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి సేకరించిన జాబితా ఆధారంగా కావాల్సిన ఎక్వి్పమెంట్ను కొనుగోలు చేశారు. అందుకు మొత్తం కోటిన్నర ఖర్చు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలోని పలు ఐటీ సంస్థలు ముందుకు వచ్చాయి. సీఎ్సఆర్ పాలసీకింద ఆస్పత్రులకు అవసరమైన ఎక్వి్పమెంట్ను అందించడానికి సహకరించారని సీపీ పేర్కొన్నారు. అన్ని ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారం మేరకు బెడ్స్, బెడ్షీట్స్, వీల్చైర్స్, పల్స్ ఆక్సీ మీటర్స్, థర్మామీటర్స్, పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కులు, స్ర్టెచర్స్, శానిటైజర్స్, సర్జికల్ మాస్కులు, స్టాండ్స్, బాడీ కవర్స్, కుర్చీలు, టేబుల్స్ కొనుగోలు చేశారు. ఒక్కో జిల్లాకు ఒక్కో లారీ చొప్పున ఎక్వి్పమెంట్స్ లోడ్ చేశారు. మొత్తం 30 లారీలను సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సీపీ సజ్జనార్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోనే ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి సహకరించిన ఎస్సీఎస్సీ, ఐటీ సంస్థలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని విలువైన సమయాన్ని కేటాయించిన వలంటీర్లను అభినందించారు.