అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను నడిపిస్తున్న వ్యక్తి నైజీరియన్: సీపీ మహేష్ భగవత్
ABN , First Publish Date - 2022-02-01T21:29:21+05:30 IST
అంతర్ర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్ల ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: అంతర్ర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్ల ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఈ రాకెట్ నడిపిస్తున్న వ్యక్తి నైజీరియన్ మార్క్ ఓలాబీ అని, 2012లో బిజినెస్ వీసాపై ఆయన ముంబై వచ్చాడన్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్టు గుర్తించామన్నారు. నైజీరియన్ మార్క్తో పాటు మరో ముగ్గురు నిందితులు తోట హర్ష వర్ధన్, దుద్దు పవన్ కుమార్, స్వామి ప్రసాద్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 38 గ్రాముల కాంట్రాబ్యాండ్ నార్కోటిక్ డ్రగ్(కొకైన్), మూడు ద్విచక్రవాహనాలతో పాటు రూ. 22 వేల నగదు, డిజిటల్ వేయింగ్ మిషన్, ఓ మొబైల్ పోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం బంజారాహిల్స్ పారమౌంట్ కాలనీలో నివాసం ఉంటున్న నైజీరియన్.. డ్రగ్స్కు బానిస అయ్యాడని, అనంతరం మార్క్ డ్రగ్ ఫెడ్లర్గా మారాడని మహేష్ భగవత్ తెలిపారు. ఢిల్లీలో నైజీరియన్తో డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్టు తేలిందన్నారు. 2018లో వీసా ముగిసిన ఇక్కడే ఉండటంతో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. 2019లో అమీర్పేట్ ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారని, మళ్లీ 2021లో గోల్కొండ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారని చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో డిగ్రీ చదువుతున్న యువకుడు ఉన్నాడని, మార్క్ తప్ప అరెస్ట్ అయిన ముగ్గరు నిందితులు కామన్ ఫ్రెండ్స్ అని తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు అభిషేక్ పరారీలో ఉన్నాడన్నారు. ఓ కేసులో మార్క్ జైలుకు వెళ్ళినప్పుడు అభిషేజ్ సింగ్కు మార్క్ పరిచయం అయ్యాడు.. అభిషేక్ ద్వారా ప్రస్తుతం అరెస్ట్ అయిన మిగతా నిందితులు పరిచయం అయ్యారన్నారు. అరెస్ట్ అయిన వారి అందరిపై పిడీ యాక్టులు పెడతామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు.