హోంగార్డు తల్లికి CP Mahesh Bhagwat పాదాభివందనం..!

ABN , First Publish Date - 2021-10-22T17:54:55+05:30 IST

ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాణాలను తృణప్రాయంగా భావించేది...

హోంగార్డు తల్లికి CP Mahesh Bhagwat పాదాభివందనం..!

  • ప్రజల కోసం ప్రాణాలిచ్చేది పోలీసే 
  • సైబరాబాద్‌, రాచకొండలో పోలీస్‌ సంస్మరణ దినోత్సవం
  • అమరులకు నివాళులు అర్పించిన సీపీలు మహేష్‌ భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్ర

హైదరాబాద్‌ సిటీ : ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాణాలను తృణప్రాయంగా భావించేది ఒక్క పోలీస్‌ మాత్రమే అని రాచకొండ, సైబరాబాద్‌ సీపీలు మహేష్‌ భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. రెండు కమిషనరేట్‌ల పరిధిలో పోలీస్‌ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. రాచకొండ సీపీ మాట్లాడుతూ విధినిర్వహణలో అసువులు బాసిన పోలీస్‌ అమర వీరుల త్యాగం  స్ఫూర్తిదాయకం అన్నారు. రాచకొండ పరిధిలో 16 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు.


2006లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టెర్రరిస్టులతో జరిగిన ఎదరుకాల్పుల్లో ఎస్‌ఐ సిద్దయ్య, ఇద్దరు కానిస్టేబుల్స్‌ సహా హోంగార్డు లింగయ్య ఉగ్రవాదులతో వీరోచింగా పోరాడి అసువులు బాశారు. ఈ సందర్భంగా లింగయ్య తల్లి సూరమ్మకు సీపీ మహేష్‌ భగవత్‌ పాదాభివందనం చేశారు. దేశ ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోవడానికి వేలాది మంది పోలీసులు రాత్రంతా మేలుకొని రక్షణగా నిలుస్తున్నారన్నారని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఆమనగల్‌ ఎస్సై కె. హన్మంత్‌రెడ్డి, తలకొండపల్లి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫసియుద్దీన్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఈశ్వర్‌రావుల సేవలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకు శాలువా కప్పి సన్మానించారు. 

Updated Date - 2021-10-22T17:54:55+05:30 IST