ఉప ఎన్నిక సజావుగా జరగాలి : సీపీ
ABN , First Publish Date - 2020-09-30T08:26:30+05:30 IST
దుబ్బాక ఉప ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని సీపీ జోయల్ డేవిస్ పోలీసు అధికారులకు
సిద్దిపేట క్రైం,సెప్టెంబరు 29 : దుబ్బాక ఉప ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని సీపీ జోయల్ డేవిస్ పోలీసు అధికారులకు సూచించారు. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో ఎన్నికల నియమావళిపై జిల్లా పోలీస్ అధికారులతో సీపీ జోయల్ డేవిస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై దిశా నిర్ధేశం చేశారు. ఎన్నికలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని, గత ఎన్నికల్లో కేసులు నమోదైన వారిని, చెడు నడవడిక గల వారిని విడతల వారీగా బైండోవర్ చేయాలని సూచించారు.
ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించేలా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గొడవలు జరిగే గ్రామాలపైన ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ లొకేషన్లు, కేంద్రాలు, రూట్ మొబైల్స్ గురించి ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతిఒక్కరూ క్రమశిక్షణగా విధులు నిర్వహించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.