మద్యం విక్రయాలు,వాహనాల రిజిస్ట్రేషన్లపై COW Cess

ABN , First Publish Date - 2021-11-20T17:15:55+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు మద్యం విక్రయాలు, వాహనాల రిజిస్ట్రేషన్లపై గోవుల సెస్ పేరిట అదనపు పన్ను విధించాలని నిర్ణయించింది...

మద్యం విక్రయాలు,వాహనాల రిజిస్ట్రేషన్లపై COW Cess

భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు మద్యం విక్రయాలు, వాహనాల రిజిస్ట్రేషన్లపై గోవుల సెస్ పేరిట అదనపు పన్ను విధించాలని నిర్ణయించింది. మద్యం విక్రయాలు, వాహనాల రిజిస్ట్రేషన్లపై వసూలు చేయనున్న అదనపు పన్నులను గోసంక్షేమం కోసం వినియోగించాలని సీఎం శివరాజ్ సింగ్ నిర్ణయించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2,200 గోశాలలతోపాటు గోవుల అభయారణ్యం, గోవుల పర్యాటకం కోసం గో సెస్ నిధులను వినియోగించాలని గో కేబినెట్ నిర్ణయించింది. ఆవుల మేత కోసం గో సెస్ ను విధించాలని సూచించడంతో అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. 


సరైన వ్యవస్థను అమలు చేస్తే ఆవుపేడ, మూత్రంతో దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయవచ్చని వారం రోజుల క్రితం సీఎం శివరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 2019లో ఆవు సెస్‌ను ప్రకటించింది, కానీ ఇది అమలులోకి రాలేదు.ఈ ఏడాది ఆగస్టులో ఎంపీ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆవుల పెంపకాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు.గోసంక్షేమంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని చౌహాన్ కోరారు. మూతపడిన ఎనిమిది గో సదన్లను తిరిగి తెరవాలని సీఎం ఆదేశించారు.


సామాజిక సేవా సంస్థలకు గోశాలల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు.ఎక్కువ పాలు ఇచ్చే ఆవులపై మరింత పరిశోధన చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఆవు ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


Updated Date - 2021-11-20T17:15:55+05:30 IST