2,27,588 మందికి కొవిడ్ వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-06-18T05:16:52+05:30 IST
జిల్లాలో ఇప్పటి వరకు 2లక్షల 27,588 మందికి కొవిడ్ టీకాలు వేశారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రతీ రోజు కనీసం 6వేలకు తగ్గకుండా వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
రోజుకు ఆరు వేలమందికి సూదిమందు
ఖమ్మం కలెక్టరేట్, జూన్17: జిల్లాలో ఇప్పటి వరకు 2లక్షల 27,588 మందికి కొవిడ్ టీకాలు వేశారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రతీ రోజు కనీసం 6వేలకు తగ్గకుండా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. జనవరి 16న జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నాటి నుంచి మే నెలలో మెదటి వారం మినహాయించి టీకాల కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతోంది. తొలి విడతలో కోవాగ్జిన్ టీకాలు వేశారు. ఆ తర్వాత మే నెలలో కోవీషీల్డ్ టీకా ప్రారంభించారు. కోవాగ్జిన్ 26,620 మందికి వేశారు. రెండో విడతలోనూ దాదాపు కోవాగ్జిన్ పూర్తిచేశారు. గురువారం నుంచి మళ్లీ జిల్లాలో కోవాగ్జిన్ టీకాల కార్యక్రమం మొదలయ్యింది. ఇప్పటి వరకు కోవీషీల్డ్ టీకాలు వేస్తున్నారు.
ఫజిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, యూపీహెచ్సీలతో పాటు ప్రత్యేక కేంద్రాల ద్వారా 35 నుంచి 40 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2,27,588 మందికి టీకాలు వేశారు. వీరిలో ప్రైవేటు ద్వారా 17,206 మందికి వేశారు. వీరిలో 58,928 మందికి 60ఏళ్ల పైబడిన వారికి, 96319 మందికి 45 నుంచి 59 వయస్సు ఉన్నవారికి, 34,880 మందికి 18 నుంచి 44ఏళ్ల వయస్సు ఉన్నవారికి టీకాలు ఇచ్చారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 4499 మందికి కోవిడ్ టీకాలు వేశారు.
నిరాటంకంగా టీకాల కార్యక్రమం: డాక్టర్ అలివేలు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి
జిల్లాలో జనవరి 16 నుంచి కోవిడ్ నియంత్రిత టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు 30 విభాగాల సిబ్బందికి ఇప్పటి వరకు టీకాలు అందచేశాం. 2.50 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశాం. ఇక సామాన్యులకు, 18 ఏళ్లలోపు వయస్సు వారికి ప్రభుత్వం టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని పరిశీలిస్తోంది. అది అమల్లోకి వస్తే జిల్లాలో అందరికీ టీకాలు వేయనున్నాం. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా టీకాల కార్యక్రమాన్ని చేపడుతున్నాం.