నేటితో కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి
ABN , First Publish Date - 2021-02-25T04:43:45+05:30 IST
ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ గురువారంతో ముగుస్తుందని జేసీ వీరబ్రహ్మం అన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 24: ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ గురువారంతో ముగుస్తుందని జేసీ వీరబ్రహ్మం అన్నారు. బుధవారం ఆయన తన కార్యాలయం నుంచి వైద్యాధికారులు, ఆస్పత్రుల సూపరిండెంటెంట్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్ను నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స పొందుతున్న, ఇటీవల కాలంలో సర్జరీ చేసుకున్న వారు తప్ప మిగిలిన వారందరూ గురువారం లోగా వ్యాక్సిన్ వేసుకునేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేందుకు ఇష్టపడని వారి నుంచి సర్టిఫికెట్లు తీసుకుని ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లో డీఎంఅండ్హెచ్వో పెంచలయ్య, డీసీహెచ్ఎస్ సరళమ్మ, డీఐవో హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.