ఆ దేశంలో కోవిడ్ మూడో దశ మొదలు

ABN , First Publish Date - 2021-07-11T08:05:41+05:30 IST

కోవిడ్ కొత్త రకం వేరియంట్లతో ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ప్రపంచంలోనే..

ఆ దేశంలో కోవిడ్ మూడో దశ మొదలు

మెక్సికో సిటీ: కోవిడ్ కొత్త రకం వేరియంట్లతో ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ప్రపంచంలోనే అత్యంత దారుణ ప్రభావం పడింది మన దేశంలోనే. అయితే ఇప్పుడు అతి తర్వలో మూడో వేవ్ కూడా వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే పనులు కసరత్తులు చేస్తున్నాయి. కాగా.. తాజాగా మెక్సికో దేశం కోవిడ్ థర్డ్ వేవ్ బారిన పడినట్లు తెలుస్తోంది. వేగంగా కేసులు పెరగడం, అందులోనూ యువకులే ఈ సారి కూడా ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడడంతో ఇప్పుడు ఆ దేశంలో ఆందోళనకరంగా మారింది.


కాగా.. ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. మెక్సికోలో గతవారంతో పోలిస్తే ఈ వారం 29శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ మూడో దశ కరోనా కేసులు అనారోగ్య సమస్యలు కలిగిన వారికంటే.. యువతలోనే పెద్ద సంఖ్యలో నమోదవుతుండడం ఇప్పుడు అనేక దేశాలను కలవరపెడుతోంది. గత ఏడాది సెప్టెంబర్లో మెక్సికోలో రెండో దశ ప్రారంభమైంది. అప్పటితో పోలిస్తే మూడో దశ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆగస్టు నాటికి ఇది పీక్ స్టేజ్‌కు చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.


అయితే ఇక్కడ ఓ ట్విట్ట్ ఏంటంటే డెల్టా వేరియంట్ వల్ల ఈ థర్డ్ వేవ్ కేసుల పెరుగుదల సంభవించలేదు. అక్కడి అధికారుల మాటను బట్టి చూస్తే.. దేశంలో టెస్టింగ్ ప్రక్రియ చాలా తక్కువగా ఉండడమే దీనికి కారణం. దేశంలో ఇప్పటివరకు దాదాపు 235 వేల మంది కరోనాతో మరణించారు. ఇవి అధికారిక లెక్కలు. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో 25,58,369 మంది కరోనా బారిన పడితే.. 2,34,193 మంది మరణించారు. వాస్తవంగా అయితే కరోనా మరణాల సంఖ్య 3లక్షల 60వేల పైనే ఉంటుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. 

Updated Date - 2021-07-11T08:05:41+05:30 IST