కొవిడ్ నిబంధనలకు తిలోదకాలు
ABN , First Publish Date - 2021-08-17T17:36:23+05:30 IST
పాఠశాలలు పునఃప్రారంభమైన..
తోటగరువు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఒక్కో తరగతిలో 35 మంది విద్యార్థులు
ఆరిలోవ: పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజు సోమవారం తోటగరువు జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొవిడ్ నిబంధనలు అమలు కాలేదు. ఒక్కో తరగతిలో 20 మంది మించి కూర్చోరాదన్న నిబంధన ఉన్నప్పటికీ 9, 10 తరగతుల్లో 35 మంది చొప్పున విద్యార్థులు కూర్చున్నారు. తొలిరోజు పదో తరగతి విద్యార్థులు 414 మందికి గాను 190 మంది, తొమ్మిది తరగతికి సంబంధించి 365 మందికి గాను 155 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరందరితో శానిటైజేషన్ చేయించి తరగతి గదుల్లోకి పంపారు. విద్యార్థులు, ఉపా ధ్యాయులందరూ మాస్కులు ధరించారు. మంగళవారం నుంచి ఆరు, ఏడు, ఎనిమిది తరగతులను ప్రారంభించ నున్నారు. విద్యార్థులు పూర్తి స్థాయిలో వస్తే తరగతి గదుల్లో ఇంకెంత మందిని కూర్చోబెడతారో వేచిచూడాలి.
భీమిలిలో స్వల్పంగా హాజరైన విద్యార్థులు
భీమునిపట్నం: పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజు సోమవారం పాఠశాలలకు విద్యార్థుల హాజరు సగానికి తక్కువ శాతంగానే ఉంది. ఝాన్సీలక్ష్మీబాయి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ 53 మంది విద్యార్థులు హాజరయ్యారు. భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కూడా తక్కువగానే విద్యార్థులు వచ్చారు. నెహ్రూ రోడ్డులోని మునిసిపల్ ఎలిమెంటరీ పాఠశాలకు 12 మందే హాజరయ్యారు.