కొవిడ్‌ రోగుల నరకయాతన

ABN , First Publish Date - 2021-05-13T06:04:29+05:30 IST

పాలకొల్లులో మంగళవారం రాత్రి పది గంటలకు ఉరుములతో కూడిన వర్షం.. ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

కొవిడ్‌ రోగుల నరకయాతన
పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో నిలిచిన విద్యుత్‌ సరఫరా

డీజిల్‌ లేక పనిచేయని జనరేటర్‌  : ఎమ్మెల్యే నిమ్మల మండిపాటు

పాలకొల్లు అర్బన్‌, మే 12 : పాలకొల్లులో మంగళవారం రాత్రి పది గంటలకు ఉరుములతో కూడిన వర్షం.. ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  జనరేటర్‌లో ఆయిల్‌ లేని కారణంగా ఆస్పత్రి అంతా అంధకారం. ఆక్సిజన్‌ బెడ్స్‌పై 50 మంది రోగులు,  ఆక్సిజన్‌ బెడ్స్‌ కోసం వరండాలో నిరీక్షిస్తున్న మరో 20 మంది పేషెంట్లు మొత్తం 70 మంది హాహాకారాలు చేస్తూ మూడు గంటలు గడిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు ఆసుపత్రికి వచ్చి అప్పటికప్పుడు 20 లీటర్ల డీజిల్‌ తెప్పించి జనరేటర్‌ పనిచేసేలా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను రాత్రి 1.10 నిముషాల సమయం వర కూ ఆసుపత్రి వద్దే ఉండి ఈ విషయాన్ని సబ్‌ కలెక్టర్‌ కు తెలియజేయగా ఆయన ఆదేశాల మేరకు తహసీల్దార్‌, డిప్యూటి డీఎంహెచ్‌వోలు ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారన్నారు. కొవిడ్‌ బాధితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కనీసం డీజిల్‌ కూడా సమకూర్చుకోలేని స్థితిలో ఆసుపత్రులు ఉంటే రోగులకు భరోసా ఏ విధంగా ఇవ్వగలరని అన్నారు.  ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే  అధికారులను కోరారు. 


Updated Date - 2021-05-13T06:04:29+05:30 IST