కొవిడ్ ఆదేశాలు సక్రమంగా అమలు జరగడం లేదు
ABN , First Publish Date - 2021-05-06T05:15:59+05:30 IST
కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో సరిగ్గా అమలు కావడం లేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు.
టాస్క్ఫోర్స్ చైర్మన్కు ఎమ్మెల్యే వెలగపూడి లేఖ
ఎంవీపీ కాలనీ, మే 5: కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో సరిగ్గా అమలు కావడం లేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కొవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబుకు లేఖ రాశారు. కరోనా బాధితులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుందన్నారు. నగరంలోని గ్యాస్ కంపెనీలకు తగిన లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా కాకపోవడంతో ఆయా కంపెనీలు జిల్లాలోని ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయలేకపోతున్నాయని, తద్వారా ఆక్సిజన్ బెడ్లు పెంచుకోలేక పోతున్నామన్నారు. అలాగే వ్యాక్సినేషన్ సరిగ్గా జరగడం లేదని, గంటల తరబడి ప్రజలు ఎండలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని, వాక్సినేషన్ కేంద్రాలను పెంచాలని ఎమ్మెల్యే కోరారు. రెమిడెసీవర్ ఇంజక్షన్లు లభించక కొవిడ్ బాధితులు ఇబ్బందులు పడుతున్నందున వీటితో పాటు మరిన్ని ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.