2020లో కొవిడ్ మరణాలు 1,60,618
ABN , First Publish Date - 2022-05-27T07:43:17+05:30 IST
దేశంలో 2020లో మొత్తం 18.11లక్షల వైద్య నిర్ధారిత మరణాల చోటుచేసుకున్నాయి.
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక
న్యూఢిల్లీ, మే 26(ఆంధ్రజ్యోతి):‘‘దేశంలో 2020లో మొత్తం 18.11లక్షల వైద్య నిర్ధారిత మరణాల చోటుచేసుకున్నాయి. వాటిలో 1,60,618 కొవిడ్ మరణాలు ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్యలో రక్తప్రసరణ వ్యవస్థలో తలెత్తిన లోపాలతో సంభవించిన మరణాల శాతం 32.1 అని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ) ప్రకటించింది. సంస్థ ప్రకటించిన నివేదిక మేరకు... దేశవ్యాపితంగా వివిధ రోగాలతో ఆ ఏడాది సంభవించిన మరణాల్లో కొవిడ్ 4వ అతిపెద్ద కారణంగా నిలిచింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సంఖ్య కంటే ఆర్జీఐ ప్రకటించిన కొవిడ్ మరణాల సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం. కొవిడ్ మరణాలుగా పేర్కొన్న 1,60,618లో ల్యాబ్లో వైరస్ కారకాన్ని నిర్ధారించినవి 1,38,713. మిగిలిన 21,905 మరణాల్లో వైరస్ నిర్ధారణ కాలేదు. 2020లో కొవిడ్తో మరణించిన వారి సంఖ్యను మహరాష్ట్ర 61212, యూపీ16484, కర్ణాటక 15476, ఏపీ 12193, ఢిల్లీ 8744గా ప్రకటించాయి. అరుణాచల్ప్రదేశ్, లక్షాద్వీప్ మాత్రమే మరణాలను నమోదు చేయలేదు.