Waiver of Fees: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన ప్రైవేటు స్కూలు విద్యార్థులకు ఫీజు రద్దు

ABN , First Publish Date - 2022-08-02T13:15:24+05:30 IST

కరోనా(Covid) వైరస్‌ సోకి తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వం రద్దు చేసిం

Waiver of Fees: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన ప్రైవేటు స్కూలు విద్యార్థులకు ఫీజు రద్దు

                                              - ప్రభుత్వ ఉత్తర్వులు


అడయార్‌(చెన్నై), ఆగస్టు 1: కరోనా(Covid) వైరస్‌ సోకి తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. కరోనా మహమ్మారికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలువురు చిన్నారులు అనాథలయ్యారు. అలాంటి వారిని గుర్తించి, వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అదేసమయంలో కరోనా కారణంగా అనాథలైన చిన్నారుల యోగక్షేమాలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రత్యేక దృష్టిసారించారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పేరిట ప్రభుత్వం రూ.5 లక్షల నగదును డిపాజిట్‌ కూడా చేస్తోంది. ఈ చిన్నారుల వయస్సు 18 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఈ మొత్తంతో పాటు దాని వడ్డీని వారికి తిరిగి చెల్లిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ హోంలు, హాస్టళ్లలో అనాథలైన విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరికి విద్య, హాస్టల్‌, ఇతర సౌకర్యాలను ప్రభుత్వమే భరించనుంది. అంతేకాకుండా, ప్రభుత్వ హోంలు లేదా హాస్టళ్లలో చేరకుండా, బంధువుల సంరక్షణలో ఉంటున్న చిన్నారులకు కూడా నెలవారీ ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.3 వేలు ఇచ్చేలా ఆదేశించింది. ఈ సహాయం 18 ఏళ్ళు పూర్తయ్యేంత వరకు అందజేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ గత ఏడాది మే 29న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న అనాథ విద్యార్థులకు స్కూల్‌ ఫీజు(School fees)ను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు రాష్ట్ర విద్యా శాఖ ఒక సర్క్యులర్‌ను పంపించింది. ఇందులో... కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు ఏదేని ప్రైవేటు పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తుంటే వారి స్కూల్‌ ఫీజును రద్దు చేయడమే కాకుండా, అలాంటి విద్యార్థులు అదే పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించేందుకు తదుపరి ఫీజులను ప్రభుత్వమే భరించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను ప్రైవేటు పాఠశాలలకు ఫీజును నిర్ణయించే కమిటీతో పాటు అన్ని ప్రైవేటు పాఠశాలలకు కూడా పంపించాలని, ఈ ఆదేశాలు అన్ని పాఠశాలలకు చేరాయా లేదా అన్నది ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు నిర్ధారించుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. 

Updated Date - 2022-08-02T13:15:24+05:30 IST