2 రోజుల్లో ఇంటికి వెళ్తారనగా
ABN , First Publish Date - 2020-08-10T09:25:54+05:30 IST
రెండురోజుల్లో డిశ్చార్జి అయి సంతోషంగా ఇంటికి వెళ్లాల్సిన తల్లీ కొడుకులు స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ప్రకాశం జిల్లా కందుకూరులో కిరాణా దుకాణం
- అగ్నిప్రమాదంలో తల్లీకొడుకు మృతి
- రెండురోజుల క్రితమే తండ్రి డిశార్జ్
కందుకూరు, ఆగస్టు 9: రెండురోజుల్లో డిశ్చార్జి అయి సంతోషంగా ఇంటికి వెళ్లాల్సిన తల్లీ కొడుకులు స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ప్రకాశం జిల్లా కందుకూరులో కిరాణా దుకాణం నిర్వహించే దుడ్డు ప్రసాద్, వెంకట జయలక్ష్మిల పెద్ద కుమారుడు పవన్కుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఇటీవల ఇంటికి వచ్చాడు. తండ్రి దుడ్డు ప్రసాద్కు 12 రోజుల క్రితం పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన విజయవాడ వచ్చి రెండురోజుల క్రితమే డిశ్చార్జ్ అయి కందుకూరు చేరుకున్నారు. తల్లీకుమారులు కూడా ఈ నెల 5న స్వర్ణప్యాలెస్ హోటల్లో కొవిడ్ కేర్ సెంటర్లో చేరారు. వారిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. మరో రెండు రోజుల్లో ఇంటికి చేరుతామన్న ఆనందంలో ఉండగానే అగ్నిప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పవన్కుమార్కు ఏడాది క్రితమే వివాహమైంది. ఆయన సతీమణి, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టించాయి.