సీసీఎంబీ ‘డ్రై స్వాబ్’ కొవిడ్-19 టెస్టుకు ఐసీఎంఆర్ పచ్చజెండా
ABN , First Publish Date - 2020-11-28T08:02:25+05:30 IST
హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ కొవిడ్-19 పరీక్షకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం ఆమోదం తెలిపింది
హైదరాబాద్, నవంబరు 27: హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ కొవిడ్-19 పరీక్షకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరీక్షా పద్ధతిలో .. సేకరించిన ముక్కు స్రావాల నమూనాలను వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం(వీటీఎం) ద్రావణంలోకి ప్రవేశపెట్టి ఒక సీసాలో భద్రపరిచి టెస్టింగ్ సెంటర్లకు తరలిస్తుంటారు. ఈక్రమంలో శాంపిళ్లతో కూడిన సీసాల్లో లీకేజీ జరుగుతోంది. ఫలితంగా టెస్టు చేయలేని పరిస్థితి ఏర్పడటంతో పాటు లీకేజీ కారణంగా శాంపిల్స్ తరలించే సిబ్బందికి ఇన్ఫెక్షన్ ముప్పు పొం చి ఉంటోంది. ఈ అవాంతరాలన్నీ అధిగమించేలా.. స్రావాల నమూనాల నుంచి ఆర్ఎన్ఏను సేకరించాల్సిన అవసరం లేని డ్రై స్వాబ్ పరీక్షా పద్ధతిని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.