అమెరికాలో కరోనా ఉధృతి.. కొత్త దశకు చేరుకున్న వ్యాప్తి
ABN , First Publish Date - 2020-08-04T13:06:01+05:30 IST
అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి కొత్త దశకు చేరుకుందని, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. అసాధారణంగా విస్తరిస్తోందని వైట్హౌస్ ఆరోగ్య నిపుణులు తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని, వాటిని అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు.
వైట్హౌస్ నిపుణులు వెల్లడి..కొత్తగా 49 వేల కేసులు..
వాషింగ్టన్, ఆగస్టు 3: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి కొత్త దశకు చేరుకుందని, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. అసాధారణంగా విస్తరిస్తోందని వైట్హౌస్ ఆరోగ్య నిపుణులు తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని, వాటిని అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ‘మేం ఇప్పుడు సరికొత్త దశకు చేరుకున్నాం. మార్చి, ఏప్రిల్ నాటి పరిస్థితులకు ఇప్పటికి పూర్తి భిన్నమైన స్థితి నెలకొంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వైరస్ అసాధారణంగా విస్తరిస్తోంది’ అని వైట్హౌస్ టాస్క్ఫోర్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ డెబోరా బ్రిక్స్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని, లేకుంటే ఈ కరోనా వైరస్ నుంచి కాపాడుకోలేరని చెప్పారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
అమెరికాలో గత 24 గంటల్లో 49,038 కేసులు బటయపడ్డాయి. ఇప్పటివరకు 46 లక్షల మందికిపైగా కరోనా వైరస్ సోకగా.. 1.55 లక్షల మందికిపైగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగానూ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. బ్రెజిల్లో కొత్తగా 24,801 కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో 8,195 మందికి వైరస్ సోకగా.. రష్యాలో మరో 5,394 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆస్ర్టేలియాలో వైరస్ మళ్లీ ప్రభావం చూపుతోంది. విక్టోరియా రాష్ట్రంలో కొత్తగా 429 కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఆసీ్సలో ఇప్పటివరకు 18,138 మంది వైరస్ బారినపడగా.. 221 మంది చనిపోయారు. వాటిలో 136 మంది విక్టోరియాలోనే ఉన్నారు.