ఆస్పత్రిలో ఉరిపెట్టుకున్న కరోనా పాజిటివ్ మహిళ

ABN , First Publish Date - 2020-09-23T22:29:02+05:30 IST

కరోనా వైరస్ సోకిన 54 ఏళ్ల ఓ మహిళ తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే...

ఆస్పత్రిలో ఉరిపెట్టుకున్న కరోనా పాజిటివ్ మహిళ

సిమ్లా: కరోనా వైరస్ సోకిన 54 ఏళ్ల ఓ మహిళ తాను చికిత్స కోసం చేరిన ఆస్పత్రిలోనే బలవన్మరణానికి పాల్పడిన వైనమిది. సిమ్లాలోని ఓ ఆస్పత్రిలో ఆమె ఉరిపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 18న కొవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో ఆమెను చికిత్స కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే మంగళవారం అర్థరాత్రి దాటాక 12:10 సమయంలో ఆమె కరోనా కేర్ వార్డు వెలుపల ఓ ఇనుప గ్రిల్‌కు ఉరిపెట్టుకుని చనిపోయినట్టు ఎస్పీ మోహిత్ చావ్లా పేర్కొన్నారు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం నుంచి వివరణ కోరామనీ.. సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఆయన తెలిపారు.


అయితే ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలంటూ మృతురాలి కుమారుడు నరీందర్ కుమార్ డిమాండ్ చేశారు. తన తల్లి మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ నెల 18న ఆస్పత్రిలో చేరినది మొదలు పలుమార్లు వేడుకున్నా ఒక్క వైద్యుడు కూడా తన తల్లికి చికిత్స చేయలేదని ఆయన వాపోయారు. ‘‘ఐసొలేషన్ వార్డులోకి వెళ్లేందుకు కూడా వైద్యులు నిరాకరించారు. ఒక్క పేషెంట్ కోసం తాము పీపీఈ కిట్ ధరించి వెళ్లలేమనీ.. మరింత మంది పేషెంట్లు వచ్చాక వెళ్తామంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఆమె ఏమైనా జైల్లో ఉన్న నేరస్తురాలా? లేక ఆస్పత్రిలో ఉన్న పేషెంటా అన్నది నాకు అర్థం కాలేదు..’’ అంటూ ఆస్పత్రి బయట ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-09-23T22:29:02+05:30 IST