దూకుడేల?

ABN , First Publish Date - 2020-07-05T06:57:36+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్లను రూపొందిస్తున్నా దేశీయంగా తయారైన వ్యాక్సిన్‌ అవసరం ఎంతో ఉంది. ప్రజల భద్రత, నాణ్యత, నైతిక విలువలను అనుసరించి దేశీయ వ్యాక్సిన్లు రూపుదిద్దుకున్నాయి. కోవ్యాక్సిన్‌ వ్యాక్సిన్‌పై భారత్‌ బయోటెక్....

దూకుడేల?

టీకాకు ‘పంద్రాగస్టు’ డెడ్‌లైన్‌పై అభ్యంతరాలు

రెడ్‌టేపిజాన్ని దృష్టిలో పెట్టుకొని అలా చెప్పాం

అంతర్జాతీయ ప్రమాణాల మేరకే క్లినికల్‌ ట్రయల్స్‌

అత్యవసర పరిస్థితి దృష్ట్యా వేగాన్ని పెంచాం

విమర్శల నేపథ్యంలో వివరణ ఇచ్చిన ఐసీఎంఆర్‌

అంతలోనే సాధ్యం కాదు.. అత్యుత్సాహంతో కీడే 

మనకున్న మంచి పేరు దెబ్బతింటుంది: నిపుణులు

18 నెలలు పట్టొచ్చు: ఐసీఎంఆర్‌ మాజీ చీఫ్‌

మోదీ పంద్రాగస్టు ప్రకటన కోసమే: విపక్షాలు

వచ్చే ఏడాది రావొచ్చు సీసీఎంబీ డైరెక్టర్‌ 


ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్లను రూపొందిస్తున్నా దేశీయంగా తయారైన వ్యాక్సిన్‌ అవసరం ఎంతో ఉంది. ప్రజల భద్రత, నాణ్యత, నైతిక విలువలను అనుసరించి దేశీయ వ్యాక్సిన్లు రూపుదిద్దుకున్నాయి. కోవ్యాక్సిన్‌ వ్యాక్సిన్‌పై భారత్‌ బయోటెక్‌ అందజేసిన సమగ్ర సమాచారం ఆశాజనకంగా ఉన్నందునే తదుపరి అనుమతులు ఇచ్చాం. ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఐసీఎంఆర్‌, పుణెలోని వైరాలజీ ల్యాబ్‌ భాగస్వామ్యం ఉంది. ప్రస్తుత పరిస్థితులు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. వ్యాక్సిన్‌ పరీక్షల ప్రక్రియను వేగవంతం చేశాం’’ 

- ఐసీఎంఆర్‌ వివరణ


న్యూఢిల్లీ, జూలై 4: కరోనా మహమ్మారి కట్టడికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కోవ్యాక్సిన్‌’ వ్యాక్సిన్‌ను పంద్రాగస్టు నాటికి తీసుకువస్తామని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) చేసిన ప్రకటనపై దుమారం రేగింది. ఒక వ్యాక్సిన్‌ తయారీకి ఏళ్లు పడుతుందని వైద్య నిపుణులు విమర్శలు గుప్పించగా.. మోదీ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాన ఘనంగా ప్రకటించుకునేందుకు ఆ డెడ్‌లైన్‌ను విధించారని విపక్షాలు దుమ్మెత్తి పోశాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్‌ శనివారం సమగ్ర వివరణ ఇచ్చుకుంది. పంద్రాగస్టు ప్రకటనపై స్పష్టతనిచ్చింది. ‘‘భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. అందుకే.. మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతినిచ్చాం’’ అని వివరించింది. దేశంలో విజృంభిస్తున్న కరోనా, అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ నిబంధనలకు పాటిస్తూ.. వ్యాక్సిన్‌ను త్వరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ‘‘కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్లను రూపొందించాయి. వాటి ప్రయోగాలు పలు దశల్లో ఉన్నాయి. అదే సమయంలో దేశీయంగా తయారైన వ్యాక్సిన్‌ అవసరం ఎంతో ఉంది. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌పై భారత్‌ బయోటెక్‌ అందజేసిన సమగ్ర సమాచారం ఆశాజనకంగా ఉన్నందునే తదుపరి అనుమతులు ఇచ్చాం. ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఐసీఎంఆర్‌, పుణెలోని వైరాలజీ ల్యాబ్‌ భాగస్వామ్యం ఉంది. ప్రస్తుత పరిస్థితులు, ప్రజారోగ్యం, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే.. వ్యాక్సిన్‌ పరీక్షల ప్రక్రియను వేగవంతం చేశాం’’ అని స్పష్టం చేసింది. పరిశోధకులు, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించే ఆస్పత్రులు, వైద్య విద్యాసంస్థలకు ఇంతకు ముందు రాసిన లేఖలో కూడా.. పరిశోధనలను వేగవంతం చేయాలని కోరామని, ఇతరత్రా సమయాభావమయ్యే కార్యక్రమాలను విస్మరించాలని సూచించామని పేర్కొంది. పరిశోధనల క్రమంలో అవసరమైన ప్రక్రియలను త్యజించకూడదని.. ట్రయల్స్‌ కోసం రిక్రూట్‌మెంట్లను జూలై 7లోగా పూర్తిచేయాలని ఆదేశించినట్లు తెలిపింది. 1,2 దశల క్లినకల్‌ ట్రయల్స్‌ పూర్తయ్యాక డేటా భద్రత పర్యవేక్షణ మండలి(డీఎ్‌సఎంబీ) నివేదికలు వచ్చాకే.. వ్యాక్సిన్‌కు అనుమతులొస్తాయని తెలిపింది. భారత్‌ బయోటెక్‌తో పాటు.. 7సంస్థలు కరోనాకు వ్యాక్సిన్‌ ను తయారు చేస్తున్నాయని చెప్పింది.


18 నెలలు పడుతుంది: మాజీ చీఫ్‌

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి కనీసం 18 నెలల సమయం పడుతుందని ఐసీఎంఆర్‌ మాజీ చీఫ్‌ ఎన్‌.కె.గంగూలీ అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఒకటో దశ మానవ ప్రయోగాల్లో ఒక వయసు వారిపై పరిశోధనలు జరుపుతారు. అది విజయవంతమైతే.. రెండో దశలో 600-700 మందిపై ప్రయోగాలు చేస్తారు. ఆ తర్వాత మూడో దశకు అనుమతినిస్తారు. చివరిదశలో ఎక్కువ మందిపై ప్రయోగాలు చేస్తారు. ఈ ప్రక్రియలన్నింటినీ ఎంత తొందరగా పూర్తి చేసినా.. అధమపక్షం 18 నెలల సమయం పడుతుంది’’ అని వివరించారు. ఐసీఎంఆర్‌ బయోఎథిక్స్‌ సలహా కమిటీ చైర్మన్‌ వసంత ముత్తుస్వామి కూడా ఇంత త్వరగా వ్యాక్సిన్‌ తయారీ సాధ్యం కాదని అన్నారు. పలువురు వైద్య నిపుణులు, పరిశోధకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ కోసమే ఐసీఎంఆర్‌ కరోనా వ్యాక్సిన్‌కు పంద్రాగస్టు డెడ్‌లైన్‌ను ప్రకటించిందని కాంగ్రెస్‌ నేత పృథ్విరాజ్‌ చవాన్‌ విమర్శించారు. ‘‘స్వాతంత్య్ట దినోత్సవాన ఎర్రకోట నుంచి ప్రధాని ప్రకటన చేయాలనే ఉద్దేశంతో ఐసీఎంఆర్‌ తొందర పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నిపుణులంతా 12 నుంచి 18 నెలల సమయం తప్పనిసరి అని చెబుతున్నారు’’ అని ట్విటర్‌లో విమర్శించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఐసీఎంఆర్‌ ప్రకటనను తప్పుపట్టారు.


వచ్చే ఏడాది రావొచ్చు: రాకేశ్‌ మిశ్రా

కరోనా వ్యాక్సిన్‌ ఇప్పట్లో రావడం కష్టమేనని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఏడాది తొలినాళ్లలో అందుబాటులోకి రావొచ్చన్నారు. పంద్రాగస్టులోగా వ్యాక్సిన్‌ తీసుకువచ్చేందుకు ఐసీఎంఆర్‌ సిద్ధమవుతుండటంపై ఆయన స్పందిస్తూ.. ‘‘బహుశా అది అంతర్గత వినియోగం కోసం అయ్యి ఉండొచ్చు. క్లినికల్‌ ట్రయల్స్‌కు ఆస్పత్రులను సన్నద్ధపర్చడానికి కావొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. కచ్చితత్వంతో క్లినికల్‌ ట్రయల్స్‌ (పెద్ద సంఖ్యలో) జరిగితే.. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో వ్యాక్సి రావొచ్చన్నారు. వ్యాక్సిన్‌ అంటే.. అనారోగ్యంతో బాధపడేవారికి ఔషధాలు ఇచ్చినంత సులభం కాదని వివరించారు.



మానవ ప్రయోగాల్లో సరైన ప్రమాణాలు పాటించకపోతే అంతర్జాతీయంగా మనకున్న పేరు దెబ్బతింటుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తుంటే.. మనకన్నా ముందే పరీక్షలు ప్రారంభించిన అమెరికా, బ్రిటన్‌, చైనాలకు లేని తెంపరితనం మనకెందుకని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ వైద్య పరిశోధకుడు డాక్టర్‌ అనంత్‌ బాను, ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎథిక్స్‌ ఎడిటర్‌ డాక్టర్‌ అమర్‌ జసానీలు ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూలు పలు విషయాలను వెల్లడించారు. వివరాలు వారి మాటల్లోనే..






సైన్స్‌ రాజకీయం కాకూడదు

మనకన్నా ముందున్న అమెరికా, చైనాలు కూడా ఎప్పుడని చెప్పలేదు 

ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎథిక్స్‌ ఎడిటర్‌ డాక్టర్‌ అమర్‌ జసానీ 


కరోనా వ్యాక్సిన్‌ రేసులో అమెరికా, బ్రిటన్‌, చైనా ముందున్నాయని వార్తలు వింటూ ఉన్నాం. ఈ దేశాలలో మానవ పరీక్షలు మూడో దశకు చేరుకున్నాయి. అయినా వారెవ్వరూ వ్యాక్సిన్‌ సమీప భవిష్యత్తులో సిద్ధమవుతుందని చెప్పటం లేదు. 2021 ప్రధమార్థంలో వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. మనం మాత్రం మొదటి, రెండో దశల మానవ పరీక్షలు పూర్తికాకుండానే వ్యాక్సిన్‌ ఎప్పు డు వస్తుందనే విషయంపై చర్చ ప్రారంభించేశాం. వాస్తవానికి పరీక్షలపై ఐసీఎంఆర్‌ రాసిన లేఖ వ్యాక్సిన్‌ అభివృద్ధి తయారీలో కలగజేసుకోవటమే! మానవ పరీక్షలు జరిపేటప్పుడు- అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వా తే అనుమతులివ్వాలని మార్గదర్శకాలున్నాయి. ఐసీఎంఆర్‌ లేఖ దీనికి విరుద్ధం. ఇప్పటి దాకా రెండు దశల కు అనుమతి ఇచ్చారు. మూడో దశ మాటేమిటో చెప్పలేదు. ప్రభుత్వం తన లబ్ధి కోసం సైన్స్‌కు సంబంధించిన ప్రక్రియలలో వేలు పెట్టాలని ప్రయత్నించటం మంచిది కాదు.




ఇప్పట్లో వ్యాక్సిన్‌ అసాధ్యం

మనకున్న మంచిపేరు చెడగొట్టొద్దు

వచ్చే ఏడాదే అనంత్‌ భాను


జూలై 7న మొదటి దశ మానవ పరీక్షలు ప్రారంభించి.. వాటిని, రెండో దశను కలిపి ఆగస్టు 15వ తేదీకి పూర్తిచేయాలని ఐసీఎంఆర్‌ రాసిన లేఖ చాలా అసంబద్ధం. అసాధ్యం కూడా.  రోటో వ్యాక్సిన్‌ అభివృద్ధికి 13 ఏళ్లు పట్టింది. వీరాసెల్‌కు 20 ఏళ్లు పట్టింది. వ్యాక్సిన్‌ తయారీలో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. వీటిలో మొదటిది- ప్రభుత్వం, రెగ్యులేటరీ అథారిటీలు ఇచ్చే అనుమతులు. రెండోది వ్యాక్సిన్‌ అభివృద్ధి.. దానిని మానవులపై ప్రయోగించి చేసే పరీక్షలు. అనుమతుల విషయంలో ఆలస్యం కాకుండా చూడటం మంచి పరిణామం. రెండో దశ పరీక్ష లను ఆగస్టు కల్లా పూర్తి చేయాలంటూ భారత్‌ బ యోటెక్‌పై ఐసీఎంఆర్‌ ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఏముందో? వ్యాక్సిన్ల తయారీలో మనకున్న మంచి పేరును నిలబెట్టుకోవాలంటే తొందరపడ టం తగదు. వచ్చే నెలలో వ్యాక్సిన్‌ విడుదల అసాధ్యం.


- స్పెషల్‌ డెస్క్

Updated Date - 2020-07-05T06:57:36+05:30 IST