ఐబీ విశ్రాంతి భవనంలో కోర్టు ఏర్పాటు
ABN , First Publish Date - 2022-05-22T05:07:31+05:30 IST
అల్లాదుర్గంలో ఏర్పాటు కానున్న జూనియర్ సివిల్ కోర్టు భవనాన్ని శనివారం మెదక్ 8వ అడిషనల్ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి కే. మారుతిదేవి, మెదక్ ఆర్డీవో సాయిరాం, డీఎస్పీ సైదులు పరిశీలించారు.
పరిశీలించిన జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కే.మారుతిదేవి
జూన్ 2న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
అల్లాదుర్గం, మే 21: అల్లాదుర్గంలో ఏర్పాటు కానున్న జూనియర్ సివిల్ కోర్టు భవనాన్ని శనివారం మెదక్ 8వ అడిషనల్ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి కే. మారుతిదేవి, మెదక్ ఆర్డీవో సాయిరాం, డీఎస్పీ సైదులు పరిశీలించారు. పెద్దశంకరంపేట, రేగోడ్, టేక్మాల్ మండలాల ప్రజలకు భౌగోళికంగా ఎంతో అనువుగా ఉన్న అల్లాదుర్గంలో ఏర్పాటు కానున్న ఈ కోర్టు భవనం కోసం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో పాటు రెవెన్యూ, పోలీస్ అధికారులు మూడు రోజుల క్రితం పలు భవనాలను పరిశీలించారు. అయితే అల్లాదుర్గం ఐబీ చౌరస్తాలో గల ఆర్అండ్బీ విశ్రాంతి భవనాన్ని అధికారులు ఎంపిక చేయగా న్యాయమూర్తి ఈ భవనాన్ని సందర్శించి పరిశీలించారు. కోర్టుకు వచ్చే ప్రజలకు ఈ భవనం ఎంతో అనువుగా ఉంటుందని, జూన్ 2న ఈ కోర్టును ప్రారంభించనున్న నేపథ్యంలో భవనాన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. న్యాయమూర్తి వెంట సీఐ జార్జి, ఎంపీపీ అనిల్కమార్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ప్రవీణ్రెడ్డి, రేగోడ్ ఎస్ఐ సత్యనారయణ, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, అల్లాదుర్గం, ఐబీ గిరిజన తండాల సర్పంచులు అంజియాదవ్, రంజిత్ తదితరులు ఉన్నారు.