Alt news co founder Zubairకు 4 రోజుల రిమాండ్
ABN , First Publish Date - 2022-06-28T23:45:25+05:30 IST
జుబెయిర్ను అరెస్టు చేయడాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్లో, బీజేపీ విద్వేషం, మతఛాందసత్వం, అబద్ధాలను బయటపెట్టే ప్రతి వ్యక్తి వారికి ముప్పేనని తెలిపారు. సత్యం పలికే ఓ గళాన్ని అణచివేస్తే..
న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడనే కేసులో అరెస్టైన ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు(Alt news co-founder) మహ్మద్ జుబెయిర్(Mohammed Zubair)కు నాలుగు రోజుల కస్టడీ విధిస్తున్నట్లు పాటియాల హౌజ్(Patiala House Court) కోర్టు మంగళవారం పేర్కొంది. ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు చేసుకున్న ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ చీఫ్.. సోమవారం అరెస్ట్ అనంతరం ఒక రోజు కస్టోడియల్ విచారణ పూర్తైందని, మరో నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 153 (అల్లర్లు చెలరేగాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల వల్ల అల్లర్లు జరిగినా, జరగకపోయినా), సెక్షన్ 295ఏ (ఏదైనా వర్గం యొక్క మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం) ప్రకారం Mohammed Zubairపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయనను సోమవారం అరెస్టు చేశారు.
జుబెయిర్ను అరెస్టు చేయడాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్లో, బీజేపీ విద్వేషం, మతఛాందసత్వం, అబద్ధాలను బయటపెట్టే ప్రతి వ్యక్తి వారికి ముప్పేనని తెలిపారు. సత్యం పలికే ఓ గళాన్ని అణచివేస్తే, వెయ్యి గళాలు అదనంగా ఉద్భవిస్తాయని హెచ్చరించారు. సత్యం ఎల్లప్పుడూ నియంతృత్వంపై గెలుస్తుందని భరోసా ఇచ్చారు. భయపడవద్దని అందరినీ కోరారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఇచ్చిన ట్వీట్లో, బీజేపీ బూటకపు వార్తలను ప్రతిరోజూ బయటపెడుతున్న ప్రపంచంలో అత్యుత్తమ జర్నలిస్టు జుబెయిర్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గొప్ప అధికారాన్ని అనుభవిస్తున్నప్పటికీ, వారు పిరికిపందలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన ట్వీట్లో, ముస్లింలకు వ్యతిరేకంగా నరమేధం జరగాలని ఇచ్చిన నినాదాలపై ఢిల్లీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరని, కేవలం విద్వేష ప్రసంగాలను రిపోర్టు చేయడం, తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడం నేరాలుగా పరిగణించి వేగంగా చర్యలు తీసుకుంటారని ఆరోపించారు.
కాగా, అరెస్ట్కు ముందు జుబైర్కు నోటీసు ఇవ్వలేదని, పలుసార్లు అభ్యర్థించినా ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వలేదని ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా అన్నారు. ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు ముహమ్మద్ జుబైర్ అరెస్టును ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. 2020వ సంవత్సరంలో నమోదు చేసిన కేసులో అరెస్టు నుంచి ఢిల్లీ హైకోర్టులో రక్షణ పొందినా, ఢిల్లీ పోలీసులు విచారణ పేరిట పిలిచి అతన్ని అరెస్టు చేశారని ఎడిటర్ గిల్డ్స్ ఆరోపించింది. జుబైర్ అరెస్టును ఖండిస్తూ విడుదల చేసిన ప్రకటనలో ఎడిటర్ గిల్డ్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు సీమా ముస్తఫా, ప్రధాన కార్యదర్శి సంజయ్ కపూర్, కోశాధికారి అనంత్ నాథ్లు సంతకాలు చేశారు. జర్నలిస్ట్ జుబైర్ను వెంటనే విడుదల చేయాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. జుబైర్, అతని వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ వార్తలను గుర్తించడంలో, తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవడంలో నిష్పాక్షికంగా ఆదర్శప్రాయమైన పని చేస్తోందని గిల్డ్ పేర్కొంది.