ఆర్జీవీ ‘మర్డర్’ మూవీపై విచారణ.. అంతా గందరగోళం!

ABN , First Publish Date - 2020-08-11T23:44:38+05:30 IST

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వస్తున్న ‘మర్డర్‌’ మూవీ విషయంలో వివాదం నెలకొన్న విషయం విదితమే...

ఆర్జీవీ ‘మర్డర్’ మూవీపై విచారణ.. అంతా గందరగోళం!

నల్లగొండ : టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వస్తున్న ‘మర్డర్‌’ మూవీ విషయంలో వివాదం నెలకొన్న విషయం విదితమే. తమ అనుమతి లేకుండా తమ పేర్లు, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా తీసి తమ జీవితాలపై ప్రభావం చూపుతున్నారని అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారం కోర్టు దాకా చేరగా.. ఇవాళ నల్గొండ కోర్టు విచారణ చేపట్టింది.


ఇవాళ ఏం జరిగింది..!?

తన క్లయింట్ రాంగోపాల్ వర్మకు కరోనా సోకినందున అఫిడవిట్‌పై సంతకం చేయలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విచారణను వాయిదా వేయాలని కూడా కోర్టును ఆయన కోరారు. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు-14కు ఎస్సీ, ఎస్టీ కోర్టు వాయిదా వేసింది. ఈ విషయమై అమృత స్పందిస్తూ.. రామ్‌గోపాల్ వర్మ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. అంతేకాదు.. తనకు కరోనా సోకలేదని ట్విట్టర్‌లో ఆర్జీవీ ప్రకటించిన విషయాన్ని కూడా అమృత ప్రస్తావించారు. తదుపరి వాయిదాలో ఈ విషయాలన్నీ న్యాయస్థానంలో ప్రదర్శిస్తామని అమృత తరుపు న్యాయవాది మీడియాకు వెల్లడించారు.


అంతా గందరగోళం..!

కాగా.. ఆర్జీవీకి కరోనా సోకినట్లు సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. వీటిపై స్పందించిన వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని ఖండించారు. అంతేకాదు తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే.. ఆయన తరఫు న్యాయవాది మాత్రం కరోనా సోకిందని సంతకం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారని ఏకంగా కోర్టుకే చెప్పడం గమనార్హం.! అటు ఆర్జీవీ.. ఇటు న్యాయవాది వ్యాఖ్యలతో ఇంతకీ ఏది నిజమో..? ఏది అబద్ధమో..? తెలియక గందరగోళం నెలకొంది. తాజా వ్యవహారంపై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో అనేదానిపై అభిమానులు, నెటిజన్లు, విమర్శకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ చిత్రాన్ని దర్శకుడు ఆనంద్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. ‘ప్రణయ్ అమృత’ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది!. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రెండు పాటలను కూడా చిత్రబృందం రిలీజ్ చేసింది.


    ‘మర్డర్’ మూవీపై అమృత ప్రణయ్ తీవ్ర అభ్యంతరం

Updated Date - 2020-08-11T23:44:38+05:30 IST