కొవిడ్ వ్యాక్సిన్ వేసుకొని వస్తుండగా..
ABN , First Publish Date - 2021-04-17T05:33:07+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ వేసుకొని ఇంటికి వెళ్తున్న ఆ దంపతులను మృత్యువు కాటేసింది. కారు రూపంలో కబళించింది. ఈ విషాద ఘటన మరిపివలస సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం భీమవరం గ్రామానికి చెందిన ఓలేటి కృష్ణమూర్తి (40), ఓలేటి అన్నపూర్ణ (38) దంపతులు బొబ్బిలిలో నివాసముంటున్నారు.
కారు ఢీకొని దంపతుల దుర్మరణం
మరిపివలస సమీపంలో ఘటన
భీమవరంలో విషాదం
సీతానగరం, ఏప్రిల్ 16: కొవిడ్ వ్యాక్సిన్ వేసుకొని ఇంటికి వెళ్తున్న ఆ దంపతులను మృత్యువు కాటేసింది. కారు రూపంలో కబళించింది. ఈ విషాద ఘటన మరిపివలస సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం భీమవరం గ్రామానికి చెందిన ఓలేటి కృష్ణమూర్తి (40), ఓలేటి అన్నపూర్ణ (38) దంపతులు బొబ్బిలిలో నివాసముంటున్నారు. శుక్రవారం ఉదయం కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేందుకు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి బైక్పై వచ్చారు. వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం బొబ్బిలి వెళ్తుండగా మరిపివలస వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఘటనాస్థలంలో కృష్ణమూర్తి మృతిచెందాడు. కొన ఊపిరితో ఉన్న అన్నపూర్ణను స్థానికులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది. 15 ఏళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం కుటుంబంతో బొబ్బిలి వచ్చిన కృష్ణమూర్తి గ్రోత్ సెంటర్లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు భారత్ చంద్ ఐఐటీలో అత్యుత్తమ ర్యాంకు సాధించి బొంబాయిలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. రెండో కుమారుడు ఇంటర్ పూర్తి చేశాడు. దంపతుల హాఠాన్మరణంతో స్వగ్రామం భీమవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. సీతానగరం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.