కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-09-18T04:44:38+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు
కావలిలోని కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న ఆర్డీవో శీనాయక్‌ తదితరులు

రేపు పరిషత ఓట్ల లెక్కింపు

జిల్లాలో పది కేంద్రాల ఏర్పాటు

ఆర్వోలు, ఏఆర్వోల నియామకం

పూర్తయిన సిబ్బందికి శిక్షణ


నెల్లూరు (జడ్పీ) సెప్టెంబరు 17 : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. హైకోర్టు తీర్పుతో పరిషత ఎన్నికల కౌంటింగ్‌ను ఆదివారం నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన సిద్ధమవగా, ఆగమేఘాలపై జిల్లా అధికార యంత్రాంగమూ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని 46 మండలాలకు  సంబంధించి 46 జడ్పీటీసీ స్థానాలకుగాను 12 ఏకగ్రీవం కావడంతో 34 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే 544 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 188 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగతా 366 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో వీటికి కౌంటింగ్‌ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలోని 10 కౌంటింగ్‌ కేంద్రాలను అధికారులు గతంలోనే నిర్ణయించారు. నాయుడుపేట, గూడూరులలోని కౌంటింగ్‌ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ విజయరావు  పరిశీలించారు. జేసీ హరేందిరా ప్రసాద్‌, ఆత్మకూరు ప్రాంతాల్లో, అదనపు ఎస్పీ వెంకటరత్నమ్మ కావలి ప్రాంతంలోని కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. 


రిటర్నింగ్‌ అధికారుల నియామకం


కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు, సిబ్బంది నియామకాన్ని జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. కౌంటింగ్‌ పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారి బసంతకుమార్‌ను ఎన్నికల కమిషన నియమించింది. అలాగే గతంలో నియమించిన 42 మంది రిటర్నింగ్‌ అధికారులు, 84 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను కొనసాగిస్తున్నారు. వీరితోపాటు కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు 483 మందిని, కౌంటింగ్‌ సహాయకులుగా 1489 మందిని నియమించారు. అలాగే ఏజంట్లు నియామకం, కౌంటింగ్‌ ప్రక్రియపై జేసీ హరేందిరాప్రసాద్‌, రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు  జడ్పీ సీఈవో సుశీల శుక్రవారం జిల్లా పరిషత సమావేశ మందిరంలో శిక్షణ ఇచ్చారు. బ్యాలెట్‌ ఓట్ల ప్రారంభం నుంచి లెక్కింపు వరకు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఏజంట్ల సమక్షంలో పకడ్బందీగా నిర్వహించేలా వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు. 


కేంద్రాలు ఇవే..


జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (నాయుడుపేట), ప్రభుత్వ హైస్కూల్‌ (ఆత్మకూరు), గిరిజన సంక్షేమ శాఖ బాలుర హాస్టల్‌ (ఆత్మకూరు), ఎంఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ (ఉదయగిరి), విశ్వోదయ ఇంజనీరింగ్‌ కాలేజీ (కావలి), బ్రహ్మయ్య కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (నార్త్‌రాజుపాలెం), ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కాలేజీ (నెల్లూరు), ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ (గూడూరు), విశ్వోదయ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ (వెంకటగిరి), ఏపీ మోడల్‌ స్కూల్‌ (కలిగిరి). 


కౌంటింగ్‌ ప్రశాంతంగా జరగాలి


పోలీస్‌ అధికారులతో ఎస్పీ విజయరావు


నెల్లూరు(క్రైం), సెప్టెంబరు 17 : ఆదివారం జరిగే జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ  ప్రశాంతంగా జరిగేలా చూడాలని పోలీసు అధికారులకు ఎస్పీ విజయరావు సూచించారు. ఎన్నికల కౌంటింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శుక్రవారం నిర్వహించిన వీడియోకాన్ఫెరెన్సకు ఉమే్‌షచంద్ర కాన్ఫరెన్స హాల్‌ నుంచి ఎస్పీ పాల్గొని మాట్లాడారు. అనంతరం జిల్లా పోలీస్‌ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కౌంటింగ్‌ సెంటర్ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జరగనున్న 10 కేంద్రాలకు ఇంచార్జ్‌ అధికారులను నియమిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పి వెంకటరత్నం, డీఎస్పీలు పాల్గొన్నారు. కాగా, కౌంటింగ్‌ ఏర్పాట్లపై ఎస్పీ జిల్లాలోని పోలీస్‌ స్టేషన్లను, పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పోలీస్‌ సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు.

Updated Date - 2021-09-18T04:44:38+05:30 IST