కలకలం రేపిన నకిలీ కరెన్సీ

ABN , First Publish Date - 2020-10-20T06:16:06+05:30 IST

నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిలకలూరిపేట వై జంక్షన్‌ సమీపంలో సుమారు రెండున్నర కోట్ల విలువ చేసే నకిలీ కరెన్సీ పట్టుబడటం కలకలం రేపింది.

కలకలం రేపిన నకిలీ కరెన్సీ

రూ.రెండున్నర కోట్ల ఖరీదైన నకిలీ నోట్లు స్వాధీనం

‌ చిన్నపిల్లలు ఆడుకునే నోట్లుగా నిర్ధారణ

గుంటూరు, అక్టోబరు 19 : నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిలకలూరిపేట వై జంక్షన్‌ సమీపంలో సుమారు రెండున్నర కోట్ల విలువ చేసే నకిలీ కరెన్సీ పట్టుబడటం కలకలం రేపింది. సోమవారం వై జంక్షన్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ బ్యాగ్‌ను వదిలివెళ్లారు. అందులో రెండున్నర కోట్ల ఖరీదైన కేవలం రెండు వేల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో నల్లపాడు పోలీసులు ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.


అయితే అది నకిలీ కరెన్సీ కూడా కాదని, పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగించే టాయ్‌ కరెన్సీ అని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. నోట్లపై ఎక్కడా రిజర్వు బ్యాంక్‌ ముద్ర లేదని, చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మహాలక్ష్మి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనే ముద్ర ఉందన్నారు. వీటిని నోట్ల మార్పిడి చేయటానికి కుదరదన్నారు. అయితే ఏటిఎంలలో పెట్టి మోసం చేయటానికి అవకాశాలు ఉన్నాయన్నారు.

గతంలో హైదరాబాద్‌తోపాటు అనేకచోట్ల ఈ తరహా టాయ్‌ కరెన్సీపై కేసులు నమోదు చేశారన్నారు. అయితే అంత పెద్ద మొత్తంలో నోట్లు ఎవరు తీసుకువచ్చారు, ఎందుకు తీసుకువచ్చారు, అక్కడ ఎందుకు వదిలివెళ్లారనేదానిపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లను, ఇతర ఆధారాలను సేకరిస్తున్నామని అర్బన్‌ ఎస్పీ తెలిపారు. మొత్తం మీద కోట్ల ఖరీదైన చిన్న పిల్లల నోట్లు లభ్యంకావటం సంచలనంగా మారింది. 


Updated Date - 2020-10-20T06:16:06+05:30 IST