ముమ్మిడివరం,
జనవరి 1: గోదావరిలోకి దూకి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడిన వలంటీర్ను
కాపాడే ప్రయత్నంలో ముమ్మిడివరం నగర పంచాయతీ 12వ వార్డు కౌన్సిలర్
గోదావరిలో మునిగి మృతి చెందాడు. వలంటీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ముమ్మిడివరం నగర పంచాయతీ బొండాయికోడు సచివాలయ పరిధి 13వ వార్డు వలంటీర్గా
పెదపూడి లక్ష్మీకుమారి అనే యువతి పనిచేస్తుంది. ఆమెకు వివాహం కాగా భర్తకు,
ఆమెకు మనస్పర్థలు రావడంతో ఇటీవలే విడాకులు తీసుకుంది. అయితే శుక్రవారం ఆమె
ఇంట్లో వివాదం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునేందుకు మండలంలోని
అన్నంపల్లి అక్విడెక్టు వద్ద వృద్ధ గౌతమీ గోదావరి నదీపాయ వద్దకు శనివారం
మధ్యాహ్నం చేరుకుంది. గోదావరిలో దూకేందుకు ఆమె అక్విడెక్టుపై అటుఇటు
తిరుగుతుండగా 13వ వార్డుకు చెందిన లంకాఫ్ ఠాణేలంకలో టెక్నికల్
అసిస్టెంట్గా పనిచేస్తున్న రెడ్డి రమణ ఈ విషయాన్ని 12వ వార్డు కౌన్సిలర్
భీమవరపు విజయదుర్గారావు(35)కు తెలిపాడు. దీంతో దుర్గారావు మోటారుసైకిల్పై
అన్నంపల్లి అక్విడెక్టుకు చేరుకున్నాడు. కౌన్సిలర్ రాకను గమనించిన
వలంటీర్ లక్ష్మీకుమారి అక్విడెక్టుపై నుంచి గోదావరిలో దూకింది. ఆమెను
రక్షించేందుకు అక్విడెక్టు దిగువన ఉన్న పాత అక్విడెక్టు వద్దకు దుర్గారావు
వెళ్లి సెల్ఫోన్, చెప్పులు, షర్ట్ అక్కడపెట్టి గోదావరిలోకి దిగాడు.
ఆమెను రక్షించే ప్రయత్నంలో నీటిప్రవాహంలో మునిగిపోయాడు.
స్థానిక మత్స్యకారులు ఈవిషయాన్ని గుర్తించి లక్ష్మీకుమారిని, విజయదుర్గారావును ఒడ్డుకు తీసుకురాగా ఆమె ప్రాణాలతో బయటపడగా, దుర్గారావు అప్పటికే మృతిచెందాడు. వలంటీర్ లక్ష్మీకుమారితో కౌన్సిలర్ దుర్గారావు సన్నిహితంగా ఉండేవాడు. ముమ్మిడివరం సీఐ ఎం.జానకీరామ్, ఎస్ఐ కె.సురేష్బాబు అక్కడకు చేరుకుని దుర్గారావు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైసీపీ రాష్ట్ర నాయకుడు పెయ్యల చిట్టిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. దుర్గారావు రెండు పర్యాయాలు కౌన్సిలర్గా పనిచేశాడు. అతడికి వివాహం కాలేదు.