ఎంఎల్హెచ్పీ ఉద్యోగులకు కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2022-05-17T05:24:22+05:30 IST
వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులు భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
తొలి రోజు 300 మందికి పిలుపు
నేడు కూడా కొనసాగనున్న ప్రక్రియ
విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి) : వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులు భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జోన్-1 పరిధిలోని 805 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించి కొద్దిరోజుల కిందటే పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. ఆన్లైన్లో ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత అభ్యర్థులు మెరిట్, వేకెన్సీ వివరాలను పొందుపర్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఆయా అభ్యర్థులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ పరిధిలో నిర్వహించిన మొదటిరోజు కౌన్సిలింగ్కు సుమారు 300 మంది అభ్యర్థులను అధికారులు పిలిచారు. వీరికి సోమవారం రాత్రి వరకు కౌన్సెలింగ్ కొనసాగింది. కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే సదరు అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ను అధికారులు అందించారు. ఆన్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ మరోసారి సర్టిఫికెట్లను పరిశీలించేందుకు అనుగుణంగానే ఆరు బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు.
ఎంఎల్హెచ్పీ ఉద్యోగులకు కౌన్సెలింగ్ను ప్రశాతంగా నిర్వహిస్తున్నామని, ఎండ తీవ్రత నేపథ్యంలో టెంట్లు ఏర్పాటు చేసి, మంచి నీటి సదుపాయం కల్పించామని ఆర్డీ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం, బుధవారాల్లో కూడా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీ కార్యాలయ సిబ్బంది నిర్మాలాకుమారి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.